4 Kidnapped in US: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురి కిడ్నాప్.. కిడ్నాప్ అయిన వారిలో 8 నెలల పాప!!
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురిని గుర్తు తెలియని సాయుధ దుండగులు కిడ్నాప్ చేశారు.
- By Hashtag U Published Date - 12:25 PM, Tue - 4 October 22

అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురిని గుర్తు తెలియని సాయుధ దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన వారిలో8 నెలల పాపతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నట్లు తెలిసింది. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో సోమవారం ఈ ఘటన జరిగింది. 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్ తో పాటు వారి ఎనిమిది నెలల పాప అరూహి ధేరితో పాటు 39 ఏళ్ల అమన్ దీప్ సింగ్ ను దుండగులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆయుధాలు చూపించి , బెదిరించి వారిని కిడ్నాప్ చేసినట్లు మెర్సిడ్ కౌంటీ పోలీసులు వెల్లడించారు. నిందితులు ఆయుధాలు కలిగి ఉన్న ప్రమాదకరమైన వారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
సౌత్ హైవే 59లోని 800 బ్లాక్ లో..
సౌత్ హైవే 59లోని 800 బ్లాక్ లో ఉన్న జస్దీప్ సింగ్ వ్యాపార స్థలం నుంచే వారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ జరిగిన ప్రదేశం చుట్టూ రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సముదాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు కిడ్నాపర్ల నుంచి ఎంటి ప్రతిపాదన కూడా అందనట్లు తెలుస్తోంది. ప్రజలకు దీనిపై ఏదైనా సమాచారం తెలిస్తే 911కి కాల్ చేయాలని పోలీస్ అధికారులు సూచించారు.
2019లో ఇలాగే..
2019 సంవత్సరంలోనూ కాలిఫోర్నియాలోనే ఇద్దరు భారత సంతతి వ్యక్తులను ఇలాగే కిడ్నాప్ చేశారు. ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ నడిపించే తుషార్ అత్రేను కాలిఫోర్నియాలోని అతడి ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. తుషార్ అత్రేతో పాటు అతడి స్నేహితురాలిని కూడా కిడ్నాపర్లు అపహరించారు.కిడ్నాప్ చేసిన కొన్ని గంటల తర్వాత తుషార్ అత్రే.. ఆయన స్నేహితురాలు కారులో చనిపోయి కనిపించారు.