SBI Reward Points Scam : ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ స్కామ్.. ఆ మెసేజ్లు చూసి మోసపోకండి
దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పెరిగాయి.
- By Pasha Published Date - 12:41 PM, Sat - 18 May 24

SBI Reward Points Scam : దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పెరిగాయి. వాటి వినియోగం కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు మన దేశంలో మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉన్నాయి.. స్మార్ట్ఫోన్లు లేని ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. చాలామంది స్మార్ట్ఫోన్ల నుంచి చాలావరకు ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఇది దేశ ప్రజలలో పెరిగిన ఆర్థిక అక్షరాస్యతకు నిలువెత్తు నిదర్శనం. అయితే ఈ గొప్ప సందర్భాన్ని అదునుగా తీసుకొని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఆకర్షణీయంగా ఉండే.. ఆశలు రేకెత్తించే మెసేజ్లను పంపి నెటిజన్లకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రత్యేకించి ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ను రీడీమ్ చేసుకోండి అంటూ సైబర్ దొంగల ఘరానా మోసం జరుగుతోంది. మోసపూరిత లింకులను జనానికి పంపించి.. వాటిని క్లిక్ చేయించి.. అకౌంట్లలోని డబ్బులను సైబర్ కేటుగాళ్లు దండుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
క్లిక్ చేయగానే 49వేలు మాయం
మీ ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ను రీడీమ్ చేసుకోండి అంటూ ఇటీవల తెలంగాణలో ఓ యువకుడికి మెసేజ్ వచ్చింది. అతడు దాన్ని క్లిక్ చేసి.. చెక్ చేసినందుకు.. కొన్ని గంటల్లోనే ఆ యువకుడి అకౌంటు నుంచి దాదాపు రూ.49వేలు డ్రా అయ్యాయి. అనంతరం సదరు యువకుడు లబోదిబోమంటూ పోలీసులు, బ్యాంకు మేనేజరుకు కంప్లయింట్ చేశాడు. వాటిని సైబర్ కేటుగాళ్లు కాజేశారని తర్వాత విచారణలో వెల్లడైంది.
Also Read :CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన వేళ.. అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్
తెలంగాణకే చెందిన మరో యువకుడి ఫోన్ నంబర్ నుంచి చాలా వాట్సాప్ గ్రూపులకు ‘ఎస్బీఐ రివార్డ్స్ను రీడీమ్ చేసుకోండి’ అనే మెసేజ్ వెళ్లింది. ఈవిషయం ఆ యువకుడికి తెలియదు. చివరకు గ్రూపుల్లో తన నంబరు నుంచి ఆ మెసేజ్ వెళ్లడాన్ని గుర్తించిన సదరు యువకుడు వెంటనే .. ఆ లింకులను తెరవొద్దు అంటూ అన్ని గ్రూపుల వాళ్లను అలర్ట్ చేశాడు. దీంతో అందరూ జాగ్రత్త పడ్డారు. ఆ లింకులను క్లిక్ చేయలేదు. లేదంటే మరింత మంది సైబర్ కేటుగాళ్ల మోసపూరిత లింకుల బారినపడి ఉండేవారు.
Also Read :Nagababu : తిరిగొచ్చిన నాగబాబు.. ఆ ట్వీట్ డిలీట్ చేసేసాను అంటూ..
‘‘మీ ఎస్బీఐ నుంచి రూ.7,250 రివార్డు యాక్టివేట్ అయింది. దాన్ని రీడీమ్ చేసుకునే గడువు ఇవాల్టితో ముగిసిపోతోంది. డబ్బులను పొందేందుకు వెంటనే ఎస్బీఐ రివార్డ్స్ యాప్ను(SBI Reward Points Scam) ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఖాతాలో డబ్బులను జమ చేసుకోండి’’ అంటూ సైబర్ కేటుగాళ్ల నుంచి మెసేజులు అందుతున్నాయి. ఎస్బీఐ యోనో పేరిట ఓ లింకును దీనికి జతపరుస్తున్నారు. ఈ లింకును క్లిక్ చేయగానే అకౌంట్లలోకి హ్యాకర్లు చొరబడి డబ్బులు కాజేస్తున్నారు. ఎవరైనా ఈ లింకును క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసేందుకు ప్రయత్నిస్తారో వారి వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో, పేరు ఎస్బీఐగా మారిపోతున్నాయి. వివరాల్లో ఎస్బీఐ హెల్ప్లైన్ అంటూ వస్తుండటంతో చూసేవారంతా అది నిజమైనదే అనుకుంటున్నారు. అమాయకత్వంతో లింకును క్లిక్ చేసి.. హ్యాకింగ్ బారిన పడిన బాధితుడి ప్రమేయం లేకుండానే అతడి ఫోన్లోని వివిధ వాట్సాప్ గ్రూపులకు కూడా ఈ లింకులు ఆటోమేటిక్గా వెళ్తున్నాయి. ఆ విధంగా సైబర్ కేటుగాళ్లు హ్యాకింగ్ ప్రోగ్రామింగ్ను రెడీ చేస్తున్నారు. ఇలాంటి బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేసేందుకు ప్రతీ పోలీస్స్టేషన్లో సైబర్ వారియర్ పేరిట సిబ్బంది అందుబాటులో ఉంటారు.