Debt: కాకినాడ బీచ్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి కోసం 12 ఏళ్లు వెతికిన ఎన్ఆర్ఐ కుటుంబం…
పదిరూపాయల బాకీ తీర్చడానికి పన్నెండేళ్లుగా ఓ ఎన్నారై ఫ్యామిలీ చేసిన ప్రయత్నం ఆఖరికి ఫలించింది. కానీ ఎవరికైతే తాము బాకీ పడ్డారో... ఆ వ్యక్తి గురించి ఓ నిజం తెలిసి వారు షాక్ అవ్వాల్సి వచ్చింది.
- By Hashtag U Published Date - 02:19 PM, Thu - 20 January 22
By- చిరంజీవి వర్మ
పదిరూపాయల బాకీ తీర్చడానికి పన్నెండేళ్లుగా ఓ ఎన్నారై ఫ్యామిలీ చేసిన ప్రయత్నం ఆఖరికి ఫలించింది. కానీ ఎవరికైతే తాము బాకీ పడ్డారో… ఆ వ్యక్తి గురించి ఓ నిజం తెలిసి వారు షాక్ అవ్వాల్సి వచ్చింది. కాకినాడకి చెందిన నేమాని మోహన్ కుటుంబం అమెరికాలో సెటిల్ అయ్యింది. ఏడాదికో రెండేళ్ళకో ఓ సారి కాకినాడ రావడం బంధుమిత్రులతో గడిపి వెళ్లిపోవడం జరిగేది. ఇలాగే 2010లో మొహన్ ఫ్యామిలీ కాకినాడకి వచ్చింది. మోహన్ తన ఇద్దరు పిల్లలు ప్రణవ్,సుచితలతో కలిసి బీచ్ కి వెళ్ళారు. ఫోటోలు తీసుకుంటూ పిల్లలు ఎంజాయ్ చేసారు. తర్వాత వారు పల్లీలు కావాలనడంతో మోహన్ అక్కడ వాటిని సైకిల్ మీద అమ్మే చిరు వ్యాపారి దగ్గర పది రూపాయలవి తీసుకున్నారు. అతనికి డబ్బులు ఇద్దామని పోకెట్ లో చెయ్యి పెట్టిన మోహన్ అవాక్కయ్యారు. పర్స్ ని ఆయన ఇంటి దగ్గరే మర్చిపోయారు. చేసేది లేక పిల్లల చేతిలోని పల్లీల పొట్లాలని ఆ అమ్మే వ్యక్తికి తిరిగి ఇచ్చెయ్యమన్నారు. కానీ… ఆచిరు వ్యాపారి వాటిని తీసుకోవడానికి అంగీకరించలేదు. మళ్ళీ వచ్చినప్పుడు తన పదిరూపాయలు ఇవ్వొచ్చని,పిల్లలు తింటున్న పల్లీలని తీసుకోవద్దని వారించాడు. దాంతో మోహన్ పిల్లలతో కలిసి ఇంటికి వచ్చేసారు. అయితే ఆవేరుశనగకాయలు అమ్ముతున్న వ్యక్తితో మోహన్ కుమారుడు ప్రణవ్ సరదాగా ఒక ఫోటో తీయించుకున్నాడు. ఆ పల్లీలు అమ్మే చిరు వ్యాపారి పేరు గింజాల పెద సత్తిబాబు అని కానీ అతనిది ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి అని కానీ మోహన్ ఫ్యామిలీకి ఏమాత్రం తెలియదు.
తర్వాత మోహన్ కుటుంబం అమెరికాకి తిరిగి వెళ్లి పోయింది. వాళ్లు కాకినాడ వచ్చినప్పుడల్లా పదిరూపాయల బాకీ తీర్చడం కోసం బీచ్ కి వెళ్ళడం, గింజాల పెదసత్తిబాబు కోసం వెదకడం, ప్రణవ్ అతనితో దిగిన ఫోటోని చూపిస్తూ అక్కడి చిరు వ్యాపారులని ఎంక్వైరీ చేసేవారు. కానీ ఎవ్వరూ అతని ఆచూకీ చెప్పలేకపోయారు. ఇలా పన్నెండేళ్ళు గడిచి పోయాయి. అయినా మోహన్ పిల్లలు తమ ప్రయత్నాన్ని విరమించలేదు. కాకినాడ యం.యల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నేమాని మోహన్ కి స్నేహితులు. మోహన్ ఈ విషయాన్ని చంద్రశేఖర్ రెడ్డికి చెప్పడంతో ఆయన ప్రణవ్ పెద సత్తిబాబుతో దిగిన ఫోటోని లోకల్ గా వున్న వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్ బుక్ పేజీల్లోనూ షేర్ చెయ్యించారు.
ఊరూ పేరూ తెలియని ఆ పెద సత్తిబాబు ఫోటో ఆఖరికి చేరాల్సిన చోటుకి చేరింది. ఆ ఫోటోలో వున్నది మూలపేటలో వుండే గింజాల పెద సత్తియ్యదిగా బంధువులు గుర్తించారు. పల్లీలు అమ్మే గింజాల పెద సత్తిబాబుకి భార్య గంగ, ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు వున్నారు. పల్లీలు అమ్ముతూనే అతను వారిని పోషించేవాడు. ఈ పన్నెండేళ్ళలోనూ అతని జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. నాగులాపల్లినుంచి మూలపేటకి మకాం మార్చాడు. అక్కడే చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాడు. ముగ్గురు కూతుళ్లకీ కొడుక్కీ పెళ్లిళ్ళు కూడా చేసాడు. సత్తిబాబు కాస్తా సత్తియ్యగా మారిపోయాడు. వాట్సాప్ లో గింజాల పెద సత్తియ్య ఫోటో చూసిన అతని బందువుల్లో అయోమయంతో పాటూ ఆందోళన మొదలయ్యింది. ఈ ఫోటోలో వున్న వ్యక్తి మాకు చాలా సహాయం చేసాడు. ఇతని ఆచూకీ తెలిసిన వాళ్ళు కాకినాడ యం.యల్.ఎ. చంద్రశేఖర్ రెడ్డిగారి ఆఫీసుకి సమాచారం ఇవ్వగలరు అని మాత్రమే వుంది. పెదసత్తియ్య మేనల్లుడు సూరిబాబు HashtagU తోమాట్లాడుతూ పెదసత్తియ్య చనిపోయి నాలుగేళ్లయ్యింది. పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టే క్రమంలో ఆయన చాలా అప్పులు చేసేసాడు. అప్పు తీర్చమని ఎవరో గట్టిగా నిలదీయడంతో సున్నిత మనస్కుడైన మా మావయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలియక అప్పిచ్చిన వాళ్లెవరో యం.యల్.ఏ. గారిని ఆశ్రయించి ఉంటారని అనుమానపడ్డాం. ఏమైతే అయ్యిందని ఆ మెసేజ్ లో వున్న నంబర్ కి ఫోన్ చేసాం. అలాటిదేమీ లేదని తమ ఆఫీసుకి పెద సత్తియ్య భార్యా పిల్లల్ని తీసుకు రమ్మని యం.యల్.ఏ. గారి పి.ఏ.చెప్పారు. దాంతో వాళ్లని అక్కడకి తీసుకు వెళ్లాను అని చెప్పాడు. సుధీర్ఘ నిరీక్షణ తర్వాత పెద సత్తియ్య ఆచూకీ తెలుసుకున్న మోహన్ ఫ్యామిలీకి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అతను ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసి చాలా ఆవేదన చెందారు. పన్నెండేళ్ళ కిందటి, పదిరూపాయలకి గానూ పెద సత్తియ్య భార్య గంగకి పిల్లలచేత ఇరవైఐదు వేల రూపాయలు ఇప్పించి నేమాని మోహన్ ఋణవిముక్తుడయ్యారు.
తన భర్త చూపిన ఉదారత వల్ల కష్టకాలంలో ఉన్న తమ కుటుంబానికి ఆర్ధిక సాయం అందిందని, ఇదే సాయం తన భర్త బతికి ఉండగా జరిగితే. అతనికి మనుషుల్లో కూడా మంచి మనుష్యులుంటారని అర్ధమయ్యేదని, ఆ నమ్మకంతో అతను బతికి వుండేవాడేమో నని కన్నీరు పెట్టుకుంది. మోహన్ పిల్లలు ఇచ్చిన సొమ్ముతో కూరగాయల దుఖాణం పెట్టుకుంటానంటోంది. అప్పు ఎప్పుడెప్పుడు తీరుద్దామా అని పన్నెండేళ్లపాటు నిరీక్షించిన ఎన్నారై మోహన్ ఒక వైపు, తన అప్పులు ఎప్పటికీ తీరవన్న భయంతో ఆత్మహత్యకి పాల్పడ్డ సత్తెకాలపు సత్తియ్య మరో వైపు.ఇద్దరూ ఇద్దరే… నాణానికి బొమ్మా బొరుసూ.*
Related News
Chandrababu: సప్తసముద్రాలు దాటొచ్చి ఓటు వేశారు.. ఎన్ఆర్ఐ టీడీపీ నేతలపై చంద్రబాబు ప్రశంసలు జల్లు
Chandrababu: ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుని దాదాపు నెల రోజులుగా ఎన్డీయే కూటమి గెలుపు కోసం పనిచేయడం అద్వితీయమని, వారి సేవలు మరవలేని�