Mamata Banerjee : డాక్టర్ అత్యాచార ఘటన..పోలీసులకు డెడ్లైన్
ఆదివారంలోగా కేసును పోలీసులు పరిష్కరించకుంటే సీబీఐకి అప్పగిస్తామన్న సీఎం మమతా బెనర్జీ..
- By Latha Suma Published Date - 03:58 PM, Mon - 12 August 24

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలి (Doctor)పై అత్యాచారం, హత్యోదంతంపై వైద్యులు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పలు వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార టీఎంసీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నేపథ్యంలో సోమవారం బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును పోలీసులు వచ్చే ఆదివారం లోపు పరిష్కరించకపోతే.. అనంతరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ)కి అప్పగిస్తామని అన్నారు. ఈ మేరకు ఈ ఘటనను పరిష్కరించాలని పోలీసులకు డెడ్లైన్ విధించారు. ఈ కేసులో ఎక్కువ మంది నిందితులు ఉంటే.. ఆదివారం లోపు అందరినీ అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పోలీసులు చేసే దర్యాప్తు వేగంగా లేకపోతే కూడా సీబీఐకి అప్పగిస్తామని అన్నారు. ఇదే సమయంలో ఆమె సీబీఐ, ఈడీలపై విమర్శలు చేశారు. సీబీఐ విజయాల రేటు తక్కువగా ఉందన్నారు. చోరీకి గురైన రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి కేసును వాళ్లు ఇంకా పరిష్కరించలేదన్నారు.
కాగా, జూనియర్ డాక్టర్ పై హత్యాచార కేసులో ఒకరి కంటే ఎక్కువ మంది నేరానికి పాల్పడి ఉండొచ్చని, లేదా, వారు నిందితుడికి సహకరించి ఉండొచ్చని కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ అన్నారు. ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. అనుమానితుల గురించి తెలిసిన వైద్య విద్యార్థులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం కోసం హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ప్రారంభించామన్నారు.
Read Also: Bangladesh Crisis: ఆయుధాలు అప్పగించాలంటూ నిరసనకారులకు గట్టి వార్నింగ్