Jubilee Hills Bypoll : హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్
Jublihils Bypoll : బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో “జూబ్లీహిల్స్ ప్రాంతంలో 80% హిందువులు బీజేపీకి మద్దతుగా ఉన్నారు” అని చెప్పడం వివాదాస్పదమైంది
- Author : Sudheer
Date : 09-11-2025 - 4:24 IST
Published By : Hashtagu Telugu Desk
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో “జూబ్లీహిల్స్ ప్రాంతంలో 80% హిందువులు బీజేపీకి మద్దతుగా ఉన్నారు” అని చెప్పడం వివాదాస్పదమైంది. దీనిపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందిస్తూ.. “ఇలాంటి మతరాజకీయాలు ప్రజలు ఇక నమ్మరు. జూబ్లీహిల్స్ ప్రజల ఓటు మతం ఆధారంగా కాదని, అభివృద్ధి ఆధారంగా ఉంటుందని బండి సంజయ్ అర్థం చేసుకోవాలి” అని అన్నారు. ఆయన మరో అడుగు ముందుకు వేసి “ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కూడా పోతుంది, రాసిపెట్టుకోండి” అని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల్లో బీజేపీపై మత కార్డును ఆడుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. “మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని అనుకోవాలా? మతం పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలు ఈ నేలలో స్థిరపడవు” అని ఛాలెంజ్ విసిరారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు మతం కాదు, మనసుతో ఓటు వేస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పౌరసౌకర్యాలు, సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకర్షిస్తున్నాయని వివరించారు. బీజేపీ చేసిన మతపరమైన ప్రచారం ప్రజల్లో ప్రతికూలంగా మారుతోందని, ప్రజలు ఇప్పుడు నిజమైన అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ఇక రేవంత్ రెడ్డి తన వ్యంగ్యాస్త్రాలను బీఆర్ఎస్పైన కూడా సంధించారు. “జూబ్లీహిల్స్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలసి పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ గెలవడం కోసం బీజేపీ కడుపుమంటతో ప్రచారం చేస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైతే వచ్చే లాభం ఎంత ఉంటుందో పరీక్షించుకుంటున్నారు” అని ఎద్దేవా చేశారు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ శిబిరం ఉత్సాహంలో ఉండగా, మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆయనపై ప్రతిదాడి ప్రారంభించారు. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ రంగం ఇప్పుడు మతం, వ్యంగ్యం, వ్యూహాలతో మిన్నంటుతోంది.