Warangal Girl Record : పేద కుటుంబం నుంచి వరల్డ్ రికార్డ్ దాకా.. హ్యాట్సాఫ్ జీవన్జీ దీప్తి
ఉమ్మడి వరంగల్ జిల్లా అమ్మాయి జీవన్ జీ దీప్తి ప్రపంచ రికార్డును సాధించింది.
- By Pasha Published Date - 05:44 PM, Tue - 21 May 24

Warangal Girl Record : ఉమ్మడి వరంగల్ జిల్లా అమ్మాయి జీవన్ జీ దీప్తి ప్రపంచ రికార్డును సాధించింది. జపాన్లో ప్రారంభమైన ‘కోబ్-2024 పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్షిప్’లో మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ జీ దీప్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఉమెన్స్ టీ -20 కేటగిరి 400 మీటర్ల పరుగును 55.07 సెకండ్లలోనే పూర్తిచేసింది. దీంతో ఈ ఏడాది పారిస్లో జరిగే పారా ఒలింపిక్స్కు ఆమె అర్షత సాధించింది. కేవలం 20 సంవత్సరాల వయసులోనే అతిపెద్ద మైలురాయిని జీవన్జీ దీప్తి అందుకుంది. దీప్తి జీవన్జీ తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. ఆమె వరంగల్లోని కల్లెడ గ్రామస్తురాలు. వీరిది చాలా పేద కుటుంబం. కొన్నేళ్ల క్రితం అథ్లెటిక్స్ ట్రైనింగ్ శిబిరం కోసం హైదరాబాద్కు వెళ్లేందుకు జీవన్జీ దీప్తి దగ్గర కనీసం బస్ టికెట్కు సరిపడా డబ్బులు కూడా లేవు. అయినా ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని కొంచెం కూడా తగ్గించుకోలేదు. తన స్కిల్స్ను పెంచుకుంటూ ముందుకుసాగారు. చివరకు మన దేశం తరఫున పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్షిప్లో(Warangal Girl Record) పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘కోబ్-2024 పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్షిప్’ పోటీల్లో మన దీప్తి మొదటి స్థానంలో నిలవగా.. టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ 55.19 సెకన్లలో 400 మీటర్ల పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈక్వెడార్కు చెందిన లిజాన్షెలా అంగులో 56.68 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచింది. పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2024లో మహిళల 200 మీటర్ల T35 విభాగంలో భారతదేశానికి చెందిన ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పురుషుల ఎఫ్56 విభాగంలో డిస్కస్ త్రోలో యోగేష్ కతునియా 41.80 మీటర్లు ఎగసి రజతం సాధించారు. టీ47 హైజంప్ విభాగంలో నిషాద్ కుమార్ కాంస్య పతకాన్ని గెలిచారు. ఇక ఈ ఛాంపియన్షిప్ పోటీలు మే 25 వరకు కొనసాగుతాయి.