Gruha Lakshmi scheme: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ, అసత్య ప్రచారాలు నమ్మొద్దు!
దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
- By Balu J Published Date - 11:03 AM, Wed - 9 August 23

హైదరాబాద్: ” కేసిఆర్ ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి ధరఖాస్తులు పంపించవచ్చు’’ ఆయన స్పష్టం చేశారు.
‘‘ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు. ప్రతి పక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నాం.” మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.