Telangana Govt: జీవో 111 అంటే ఏమిటి? దీని వెనకున్న కథేంటి..?తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎత్తివేస్తోంది…?
జీవో 111 అంటే ఏమిటి..? దీని వెనకున్న కథేంటి? ఎందుకు ఈ జీవోను ఎత్తివేస్తున్నారు..? దీంతో ఎవరికి ప్రయోజనం..? ఎవరికి నష్టం. ఈ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఎందుకు అలజడి మొదలవుతుంది.
- By Hashtag U Published Date - 01:14 PM, Tue - 29 March 22
జీవో 111 అంటే ఏమిటి..? దీని వెనకున్న కథేంటి? ఎందుకు ఈ జీవోను ఎత్తివేస్తున్నారు..? దీంతో ఎవరికి ప్రయోజనం..? ఎవరికి నష్టం. ఈ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఎందుకు అలజడి మొదలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి జివో 111ను ఎత్తివేస్తామని చెప్పడంతో మరోసారి దుమారం రేపింది. మార్చి 15న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…నిపుణుల కమిటీ రిపోర్టు అందిన తర్వాత..త్వరలోనే జీవోను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రకటన…పర్యావరణవేత్తలు, పౌరులకు ఆగ్రహం తెప్పించింది. భారతదేశపు వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ దీనిపై సుప్రీంకోర్టు ఆశ్రయిస్తానన్నారు. అసలు జీవో 111 ఏం చెబుతోంది. వివాదానికి కారణం ఏంటి?
చరిత్ర…
జీవో 111 గురించి తెలుసుకునే ముందు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఈ రెండు జంట జలాశయాల గురించి తెలుసుకోవాలి. 1908లో హైదరాబాద్ తన చరిత్రలోనే అత్యంత ఘోరమైన వరదలను చూసింది. భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉప్పొంగి ప్రవహించింది. ఈ వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వల్ల భాగ్యనగరానికి ఎప్పటికీ నష్టం వాటిల్లకూడదని..ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్…ప్రముఖ ఇంజనీర్ ఎం విశ్వేశ్వరయ్యను నగరానికి ఆహ్వానించారు. మూసీ పై రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లను నిర్మించాలని విశ్వేశ్వరయ్య ప్రతిపాదించారు. భారీ వర్షాల కారణంగా వచ్చే వరదకు అడ్డుకట్ట వేయాలంటే…ఈ రిజర్వయర్ల ద్వారా నియంత్రించవచ్చని నిర్దారించారు.
దీంతో ఉస్మాన్ సాగర్ ను 1920లో నిర్మించగా…హిమాయత్ సాగర్ ను 1927లో నిర్మించారు. ఆ తర్వాత దశాబ్దాలపాటు హైదరాబాద్ కు ప్రధాన తాగునీటి వనరుగా ఈ రిజర్వాయర్లను కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ జీవోను ఎత్తివేయాలని ఎన్నో విధాలా ప్రయాత్నాలు చేశారు. కానీ కుదరలేదు.
జీవో 111 ఏం చెబుతోంది…?
ఈ జీవో పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిషేధం విధించింది. వ్యవసాయం తప్పా ఏ రంగానికి ఇక్కడ భూమీ కేటాయించకూడదని…నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించేలా లేదా కలుషితం చేసేలా నిర్మాణాలు నిషేధమని నిజాం ప్రభువు ఫర్మాన్ జారీ చేశారు. అప్పటి నుంచి జీవో కూడా అదే బాటలో కొనసాగింది. అంతేకాదు పూర్తి ట్యాంక్ స్థాయి (FTL) నుంచి 10 కి.మీ వరకు హిమాయత్ సాగర్, ఉస్మార్ సాగర్ పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు, హోటళ్లు, నివాసాలు లేదా ఇతర సంస్థలను నిషేధించింది. ఏళ్ల తరబడి హైదరాబాద్ కు తాగునీటి వనరులుగా ఉన్న ఈ జీవోను రద్దు చేయాలని పదే పదే రాజకీయ పార్టీలు పిలుపునిస్తున్నాయి. అప్పటి నుంచి అనేక అక్రమ కట్టడాలు వెలిసాయి. ఖానాపూర్ గ్రామం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్మించిన రహదారి రిజర్వాయర్ పూర్తిగా నిండినప్పుడు వరదలోనే ఉంటుంది. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయి.
కృష్ణా, గోదావరి నదుల నుంచి హైదరాబాద్ కు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఈ రెండు రిజర్వాయర్లు కూడా నిరుపయోగంగా మారాయంటూ…ముఖ్యమంత్రి కేసీఆర్ వాదించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద పరిణామాలకు దారి తీస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 రద్దు ప్రకటించిన వార్త తనను కలవరపెట్టిందని రాజేంద్ర సింగ్ అన్నారు. ఈ రెండు రిజర్వాయర్లు ఒక్క హైదరాబాద్ కే కాదు..యావత్ దేశానికే గర్వకారణమన్నారు. జీవో 111ను రద్దు చేయడం రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అన్నారు. తెలంగాణ సీఎం ఈ చర్యను ఉపసంహరించుకోకపోతే…సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
జీవో111లో భారీ ఎత్తున పెట్టుబడులు…
జీవో 111 పరిధిలో భారీ ఎత్తున లావాదేవీలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు అంతా 111లో పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలో రియల్ ఎస్టేట్ భారీగానే జరుగుతోంది. 111జీవో ఎత్తివేయాలంటూ చాలామంది కోర్టును ఆశ్రయించారు కూడా. వారికి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని భావిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. 111జీవో పరిధిలోని 1,32,600 ఎకరాల భూమి ఉందని…గతంలో ఈ జంట జలాశయాల పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఈ జలాశయాల నుంచి నీరు అవసరం లేదని..ఇంకో వంద ఏళ్ల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదన్నారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అన్నారు కేసీఆర్. నిపుణుల కమిటీ రిపోర్టు అందగానే…111 జీవో ఎత్తివేస్తామన్నారు. దీంతో 111జీవో పరిధిలో ఉన్న భూములు బంగారం కానున్నాయి.
Related News
Hyderabad: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారుతుంది. కానీ గత 24 గంటల్లో నగరంగాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది