111 GO: రియల్టర్ల సామ్రాజ్యంలో `జీవో 111`హుష్.!
ఇప్పుడు తెలంగాణలోను... అందులోనూ హైదరాబాద్ లో జీవో 111పై ఒకటే చర్చ. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దాని గురించి మాట్లాడారు. దానిని ఎత్తేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
- By Balu J Published Date - 04:42 PM, Wed - 16 March 22
ఇప్పుడు తెలంగాణలోను… అందులోనూ హైదరాబాద్ లో జీవో 111పై ఒకటే చర్చ. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దాని గురించి మాట్లాడారు. దానిని ఎత్తేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీంతో ఆ జీవో ఏమిటో.. దానివల్ల లాభనష్టాలు ఎవరికో అన్న చర్చ జరుగుతోంది. జంట జలాశయాల పరిరక్షణ కోసం జారీ చేసిందే జీవో 111. కానీ దీనిని ఎత్తేయడంపై కొందరు సానుకూలంగా ఉంటే మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. అసలేమిటీ 111 జీవో?
హైదరాబాద్ శివార్లలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ కు వీటి నుంచి వచ్చే నీరే దిక్కు. అందుకే అలాంటి జలాశయాలను కాపాడాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం తీసుకువచ్చిందే ఈ జీవో 111. దీని ప్రకారం.. వీటి చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో పలు నిర్మాణాలపై నిషేధం ఉంటుంది. ఈ జాబితాలో భారీ హోటళ్లు, కాలుష్య కారక నిర్మాణాలు, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు, నివాస కాలనీలు ఉన్నాయి. ఈ జలాశయాల పరిరక్షణ కోసం 1994లో మొట్టమొదటిసారిగా జీవో నెంబర్ 192 వచ్చింది. తరువాత దానికి కొన్ని మార్పులు చేర్పులూ చేశారు. ఆ తరువాత 1996 మార్చి 8న మరో జీవో వచ్చింది. అదే 111 జీవో. ఈ జీవోలో కొన్ని స్పష్టమైన నిబంధనలను పొందుపరిచారు. దానిప్రకారం.. క్యాచ్ మెంట్ పరిధిలో వేసే లేఅవుట్లలో ఓపెన్ స్థలాలు, రోడ్ల కోసం 60 శాతం స్థలాన్ని విడిచిపెట్టాలి.
రసాయనాలు కాని, క్రిమిసంహారకాలు కాని ఉంటే.. వాటి స్థాయి ఎంత ఉందో తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన సంస్థతో పర్యవేక్షణ జరపాలి. ఎంత భూమినైతే వినియోగిస్తు్న్నారో అందులే 90 శాతం జాగాను కన్జర్వేషన్ కోసం వదలాలి. ఈ విషయంలో హుడాదే బాధ్యత. ఇక అన్నింటికీ మించిన మరో పాయింట్.. ఈ పరిధిలో జీ+2 నిర్మాణాలను అనుమతించరు. ఈ పాయింట్ స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. అప్పట్లో హైదరాబాద్.. ఈ జంట జలాశయాల నీటిపై ఆధారపడినా.. తరువాతి కాలంలో కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయి. అందుకే ఆ జలాశయాల నీరే ఆధారం అనే పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చింది. దీనివల్లే 111 జీవోను పూర్తిగా ఎత్తేయాలని, లేదా దాని పరిధిని తగ్గించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో ఈ జీవోపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఓ కమిటీ వేసింది. ఇక జీవో ఎత్తేయాలని చాలామంది హైకోర్టుకు వెళ్లారు. ఉన్నత న్యాయస్థానం కూడా 111 జీవోపై ప్రభుత్వ వైఖరిని తెలపాలని ఆదేశించింది. కేసీఆర్ కూడా కిందటేడాది ఈ జీవోపై సమీక్ష చేశారు. జలాశయాల పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్లాన్ తయారుచేయాలన్నారు. ఇప్పుడు ఏకంగా ఈ జీవో రద్దు ప్రకటనను స్వయంగా కేసీఆరే చేశారు.
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది