Group 1 Exam : గ్రూప్ 1 పరీక్ష మళ్లీ పెట్టాల్సిందే.. హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు
Group 1 Exam : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది.
- By Pasha Published Date - 01:42 PM, Wed - 27 September 23
Group 1 Exam : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను మరోసారి నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కారు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ ను డివిజన్ బెంచ్ కూడా తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్..గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను తప్పనిసరిగా మరోసారి నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. తదుపరి గా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించే సమయంలో ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరును అభ్యర్థుల నుంచి తీసుకోవాలని నిర్దేశించింది. ఇక ఇవాళ విచారణ సందర్భంగా.. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించడానికి ఉన్న అభ్యంతరం ఏమిటని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను హైకోర్టు ప్రశ్నించింది.
వాదోపవాదనలు ఇలా సాగాయి..
‘‘గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం ఉంది. బయోమెట్రిక్ ఏర్పాటు చేయకపోవడం సరికాదు. వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం వల్లే గతంలో పరీక్ష రాసిన 50 వేల మంది అభ్యర్థులు రెండోసారి పరీక్ష రాయలేదు’’ అని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ‘‘మొదటి సారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించినప్పుడు 2.85 లక్షల మంది బయోమెట్రిక్ తీసుకున్నారు. రెండోసారి ఎగ్జామ్ రాసిన 2.33 లక్షల మంది నుంచి బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు ?’’ అని టీఎస్ పీఎస్సీని న్యాయస్థానం అడిగింది. దీనిపై టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది బదులిస్తూ.. ‘‘పిటిషన్ వేసింది ముగ్గురు అభ్యర్థులే. వారి కోసం కోసం మొత్తం పరీక్షను రద్దు చేయమనడం సమంజసం కాదు. బయోమెట్రిక్ పెట్టడం, పెట్టకపోవడమనేది టీఎస్పీఎస్సీ నిర్ణయం. నిబంధనలను సవరించుకునే వెసలుబాటు టీఎస్పీఎస్సీకి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించేందుకు నిరాకరించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. తప్పకుండా ఇంకోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాల్సిందే అని స్పష్టం చేసింది.
Also read : Amaravati Inner Ring Road Case : ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
గత సంవత్సరం అక్టోబరు 16న తొలిసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో ఆ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. దీంతో మళ్లీ ఈ ఏడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఈసారి పరీక్ష నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను మరోసారి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నిర్దేశించింది. జూన్లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న తీర్పును (Group 1 Exam) వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. ఇప్పుడు అక్కడ కూడా టీఎస్ పీఎస్సీకి చుక్కెదురైంది.
Tags
Related News
TSPSC -Group 1 : గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్పీఎస్సీ అప్పీల్
TSPSC -Group 1 : గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను మరోసారి రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్పీఎస్సీ అప్పీల్ చేసింది.