Dalith Bandhu : దళితబంధు నిలిపివేత! ఎన్నికల అస్త్రంగా మలుచుకునే ప్లాన్!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఆగిపోయింది. దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది.
- By CS Rao Published Date - 11:30 AM, Wed - 23 November 22
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఆగిపోయింది. దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. లబ్దిదారుల ఎంపిక విషయంలో నెలకొన్న న్యాయ చిక్కులు ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేసేలా చేసింది. సరికొత్త మార్గదర్శకాలతో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తోన్న కేసీఆర్ సర్కార్ దళిత బంధును ఇప్పట్లో అమలు చేయకుండా వాయిదా వేసేలా చేసింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పథకాన్ని అమలు చేయాలని ఆనాడు ఒత్తిడి వచ్చింది. అయినప్పటికీ ఈటెలను ఓడించడానికి కేవలం హుజురాబాద్ వరకు పైలెట్ ప్రాజెక్టు కింద పథకాన్ని తీసుకున్నారు. పథకం కోసం లబ్దిదారుల ఎంపికను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దానిపై హైకోర్టు స్పందిస్తూ లబ్దిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు ఇవ్వరాదని, ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఎంపిక చేయాలని ఆదేశించింది. దీంతో ఆ పథకాన్నే కేసీఆర్ సర్కార్ నిలిపివేసింది.
Also Read: Modi and KCR: అంతటా అలజడి!కేంద్రం వేటలో కేసీఆర్ నైతిక ఆట!
గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) తొలి విడతగా నియోజకవర్గాల వారీగా 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులకు లేదా టీఆర్ఎస్ కార్యకర్తలకు, స్నేహితులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చారని ఆరోపిస్తూ దళిత సంఘాలు ఆరోపించాయి. లబ్దిదారుల ఎంపికపై నియోజకవర్గాల్లో తీవ్ర నిరసనలకు దారితీసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే, రాష్ట్రంలోని దాదాపు లబ్ధిదారులందరినీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ స్థానిక నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల ఎంపికలో కీలకపాత్ర పోషించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) మూడు దశల్లో ప్రతి నియోజకవర్గంలో 1,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలను కోరింది. ప్రస్తుతం 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు తొలిదశ కొనసాగుతుండగా, ఈ దశలో హైకోర్టు తీర్పు వెలువడింది. దీంతో ప్రభుత్వం ప్రక్రియను నిలిపివేసి అధికారులతో కూడిన కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలు సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపిక కోసం కమిటీల కూర్పుపై మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులను కోరింది. దళిత బంధు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, ధృవీకరించడానికి మరియు ఆమోదించడానికి నియోజకవర్గ స్థాయిలోని కమిటీలలో రెవెన్యూ , ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులను చేర్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా ముగిసే సమయానికి కొంత టైమ్ పట్టే అవకాశం ఉంది. ఆలోపు ఎన్నికల షెడ్యూల్ వస్తే, దళిత బంధును ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని ప్రత్యర్థులు అనుమానించడంలో తప్పులేదేమో!
Also Read: Malla Reddy Upset: రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు.. మంత్రి మల్లారెడ్డి సీరియస్!
Related News
KCR: మహారాష్ట్రలో మరో సభకు ప్లాన్ చేస్తోన్న కేసీఆర్… ఈ సారి అక్కడే ఇక !
తెలంగాణ రాష్ట్ర సమితి, భారత సమితిగా మారినప్పటి నుంచి దూకుడుగా వెళ్తోంది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని నిర్ణయించుకుంది.