Telangana Bandh : ఈ నెల 14న తెలంగాణ బంద్
Telangana Bandh : ఈ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు
- By Sudheer Published Date - 07:47 AM, Fri - 7 February 25

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని పలు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు సంయుక్తంగా ఈ బంద్ను ప్రకటించాయి. ప్రభుత్వ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ హక్కులను కాపాడుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా మాల మహానాడు నేతలు కీలక ఆరోపణలు చేశారు. మాలలను అణచివేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే MRPS నేత మందకృష్ణ కలిసి కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Thandel : తండేల్ టాక్ ఎలా ఉందంటే..!!
ఎస్సీ వర్గీకరణ అమలైతే, మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఇటీవల ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి మద్దతుగా అలాగే వ్యతిరేకంగా సామాజిక వర్గాల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాల మహానాడు, ఇతర వర్గీకరణ వ్యతిరేక సంస్థలు దీన్ని ద్రోహంగా అభివర్ణిస్తున్నాయి. తమ హక్కులను భవిష్యత్తులో ఎవరు హరించలేరనే విధంగా తీవ్ర పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ బంద్కు వివిధ సామాజిక వర్గాల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా జీవనం అస్తవ్యస్తం కావొచ్చని, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో చర్చ నడుస్తోంది. మొత్తంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై తీవ్ర అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. 14న జరిగే బంద్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.