Raja Singh : రాజాసింగ్పై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేత.. ఫస్ట్ లిస్టులో పేరు ?
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ రెడ్ కార్పెట్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనను పార్టీలో మళ్లీ యాక్టివ్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
- By Pasha Published Date - 11:49 AM, Sun - 22 October 23

Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ రెడ్ కార్పెట్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనను పార్టీలో మళ్లీ యాక్టివ్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీపరంగా రాజాసింగ్పై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ హైకమాండ్ ఎత్తేసింది. ఈమేరకు బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ తో అభ్యర్థుల ఎంపికపై తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు చర్చలు జరిపారు. ఆ సందర్భంగానే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత అంశాన్ని ప్రస్తావించగా.. పార్టీ చీఫ్ జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారని తెలిసింది.
అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో..
అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో గత ఏడాది ఆగస్టులో రాజాసింగ్ను బీజేపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు ఇవాళ రిలీజ్ కానున్న బీజేపీ ఫస్ట్ లిస్టులో కూడా రాజాసింగ్ పేరు ఉందని తెలుస్తోంది. తనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని రాజాసింగ్ పలుమార్లు పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర నాయకత్వం సుముఖంగానే స్పందించినప్పటికీ, జాతీయ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈనేపథ్యంలో రాజాసింగ్ పార్టీ మారుతారనే చర్చ కూడా జరిగింది. ఈ ప్రచారాన్ని రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. అవసరమైతే రాజకీయాల నుంచి వైదొలుగుతా కానీ, వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన(Raja Singh) తేల్చి చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
రాజాసింగ్ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే గో సంరక్షణ, హిందూ వాహిని సభ్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రల నిర్వహణతో వెలుగులోకి వచ్చారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీతో కావటం గమనార్హం. గతంలో టీడీపీ నుంచి మంగళహాట్ కార్పొరేటర్గా రాజాసింగ్ గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేేరారు. 2014, 2018లో మంగళ్హాట్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో ఆయన శాసనసభా పక్ష నాయకుడిగానూ ఎన్నికయ్యారు.