Kachiguda To Kakinada : దసరా వేళ ‘కాచిగూడ టు కాకినాడ’ ప్రత్యేక రైళ్లు.. వివరాలివీ
Kachiguda To Kakinada : దసరా పండుగ వేళ రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్ధం కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
- By Pasha Published Date - 10:29 AM, Sun - 15 October 23

Kachiguda To Kakinada : దసరా పండుగ వేళ రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్ధం కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈనెల 19, 26 తేదీల్లో కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు(ట్రైన్ నెంబర్ 07653) రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటలకల్లా కాకినాడకు చేరుకుంటుంది. ఈనెల 20, 27 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి మరో ప్రత్యేక రైలు(07654) కాచిగూడ వైపునకు నడుస్తుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5.10 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 4.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్స్ మల్కాజిగిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో 1AC, ఏసీ 2 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల టికెట్ చార్జీలను అమాంతం పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. రెగ్యులర్ టికెట్ చార్జీల కంటే అదనంగా 30 నుంచి 50 శాతం మేర స్పెషల్ ట్రైన్ల టికెట్లకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. రిజర్వేషన్కు దాదాపు రెండు నెలలు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా.. సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేకపోవడంతో ప్రజలు గాబరా పడుతున్నారు. అంతా వెయిటింగ్ లిస్టు, ఆర్ఏసీతోనే సరిపోతోందని చెబుతున్నారు. ఒక వేళ టికెట్ బుక్ చేసుకుని, టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే అందులో కూడా రూ.25 నుంచి రూ.50 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. దసరా, దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ వంటి రైల్వే డివిజన్ల పరిధిలో దాదాపు 620 ప్రత్యేక రైళ్లను (Kachiguda To Kakinada) నడుపుతోంది.