Maoists Encounter : భద్రాద్రి అడవుల్లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
పోలీసులు, మావోయిస్టుల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి.
- By Pasha Published Date - 09:20 AM, Thu - 5 September 24

Maoists Encounter : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిలో తెలంగాణకు మావోయిస్టు అగ్రనేత ఒకరు ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ పూర్తయ్యాక వివరాలను తెలియజేస్తామన్నారు.
We’re now on WhatsApp. Click to Join
మాచర్ల ఏసోబు 33 ఏళ్ల ప్రస్థానానికి తెర
మావోయిస్టు అగ్రనేత, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జి మాచర్ల ఏసోబు (71) హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం వాస్తవ్యుడు. మంగళవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయారు. టేకులగూడెంకు చెందిన మాచర్ల చంద్రయ్య, గట్టు మల్లమ్మ దంపతుల పెద్ద కుమారుడే మాచర్ల ఏసోబు. ఆయన ఐదో తరగతి వరకు చదువుకున్నారు. స్థానికంగా ఉండే దొర దగ్గర కొన్నాళ్లు పాలేరుగా పనిచేశాడు. తదుపరిగా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు ఏసోబు ఆకర్షితులయ్యారు. 1991లో పీపుల్స్వార్ అన్నసాగర్ దళంలో చేరారు. దళంలో అగ్రనేతగా ఎదిగారు. వ్యూహరచనలో ఏసోబు పేరుపొందారు. గత 33 ఏళ్లుగా మావోయిస్టులలో ఆయన సాగించిన ప్రస్థానం.. మంగళవారం రోజు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్తో ముగిసింది. ఆయన సతీమణి లక్ష్మి గత సంవత్సరమే చనిపోయారు. ఏసోబుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఏసోబుపై పోలీసులు గతంలో రూ.25 లక్షల రివార్డు ప్రకటించారు.
Also Read :Nandigam Suresh :హైదరాబాద్లో వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 9 మంది మావోయిస్టుల వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. మృతుల్లో రణదేవ్తో పాటు పీఎల్జీఏ సభ్యురాలు శాంతి, ఏరియా కమిటీ సభ్యురాలు సుశీల మడకం, కట్టేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యురాలు గంగి ముచాకీ, సురక్షా దళ సభ్యురాలు లలిత, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ గార్డ్ కవిత, మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడు కోసా మాద్వి, ప్లాటూన్ సభ్యుడు కమలేష్, సురక్షా దళ సభ్యురాలు హిడ్మే మడకం ఉన్నారు.