ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు!
అంతేకాకుండా అర్థరాత్రి వేళల్లో ప్రయాణించే వారి ఇబ్బందులను గమనించిన మెట్రో అధికారులు మరో కీలక అంశంపై దృష్టి సారించారు.
- Author : Gopi
Date : 22-04-2026 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
Metro Trains: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసుల రవాణా కష్టాలను తీర్చేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్అండ్టీ మెట్రో సంస్థతో జరిపిన సంప్రదింపుల అనంతరం మెట్రో రైళ్ల రాకపోకల ఫ్రీక్వెన్సీని గరిష్ట స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించింది. సాధారణ రోజుల్లో కేవలం రద్దీ సమయాల్లో మాత్రమే నడిపే 56 రైళ్లను, ఇప్పుడు సమ్మె కాలంలో రోజంతా నిరంతరాయంగా నడపాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా రైళ్లు అందుబాటులో ఉంటాయి.
సాధారణంగా రద్దీ లేని సమయాల్లో రైళ్ల సంఖ్యను తగ్గించి 44 రైళ్లను మాత్రమే నడుపుతుంటారు. కానీ ఇప్పుడు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఆ విధానానికి స్వస్తి పలికారు. సమ్మె సమయంలో మియాపూర్ నుండి ఎల్బీనగర్ కారిడార్లో ప్రతి 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు, అలాగే నాగోల్ నుండి రాయదుర్గం కారిడార్లో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల బస్సులు లేక ఇబ్బంది పడుతున్న నగరవాసులకు మెట్రో ప్రయాణం ఎంతో ఊరటనివ్వనుంది.
Also Read: కాబోయే భార్యతో గంగా హారతిలో పాల్గొన్న టీమిండియా ప్లేయర్!
అంతేకాకుండా అర్థరాత్రి వేళల్లో ప్రయాణించే వారి ఇబ్బందులను గమనించిన మెట్రో అధికారులు మరో కీలక అంశంపై దృష్టి సారించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు ఉన్న మెట్రో చివరి రైలు సేవలను, సమ్మె ముగిసే వరకు మరికొంత సమయం పొడిగించే అంశాన్ని ఎల్అండ్టీ పరిశీలిస్తోంది. ప్రభుత్వ విన్నపం మేరకు రాత్రి వేళల్లో కూడా అదనపు సర్వీసులు నడపడం ద్వారా సామాన్య ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా మెట్రో యంత్రాంగం పనిచేస్తోంది. ప్రయాణికుల రద్దీని బట్టి త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.