తెలంగాణ మున్సిపల్ ఆఫర్ : ఓటుకు రూ.30వేలు.. గెలిపిస్తే అర తులం బంగారం!
ప్రలోభాల పర్వం కేవలం నగదుకే పరిమితం కాకుండా వింత వింత హామీలకు వేదికవుతోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఒక అభ్యర్థి అయితే ఏకంగా తానే గెలిస్తే ఓటర్లకు అర తులం బంగారం ఇస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది
- Author : Sudheer
Date : 10-02-2026 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Municipal Offer : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అంశం రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని అవుటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో ఉన్న మున్సిపాలిటీలలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు బరితెగిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఓటుకు రూ. 10 వేల నుండి రూ. 30 వేల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్న ప్రాంతాల్లో వార్డు కౌన్సిలర్ పదవి కోసం అభ్యర్థులు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తుండటం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది.
ప్రలోభాల పర్వం కేవలం నగదుకే పరిమితం కాకుండా వింత వింత హామీలకు వేదికవుతోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఒక అభ్యర్థి అయితే ఏకంగా తానే గెలిస్తే ఓటర్లకు అర తులం బంగారం ఇస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల ఓటుకు రూ. 3 వేల నుండి 5 వేల వరకు నగదు పంపిణీ చేయడంతో పాటు, ఆదివారాల్లో చికెన్, మటన్ విందులు మరియు మద్యం పంపిణీతో ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటును ఒక వస్తువుగా మార్చి, వేలం పాట తరహాలో అభ్యర్థులు పోటీ పడటం ఆందోళన కలిగిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు చేస్తున్న ఈ భారీ ఖర్చు భవిష్యత్తులో అవినీతికి పునాది వేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖర్చు చేసిన కోట్లాది రూపాయలను తిరిగి రాబట్టుకోవడానికి ఎన్నికల తర్వాత అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల అధికారులు నిఘా పెంచుతున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నగదు, బంగారు పంపిణీలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సరళిని పూర్తిగా మార్చేస్తున్నాయి.