L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్
L&T : శంషాబాద్ ఎయిర్పోర్ట్(Shamshabad Airport) వరకు మెట్రోను కొనసాగించాలని నిర్మాణ బాధ్యతలు తీసుకున్న L&T సంస్థ కోరినా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ ప్రతిపాదనను తిరస్కరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు
- By Sudheer Published Date - 07:39 PM, Fri - 26 September 25

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్(Hyd Metro Project)పై తాజాగా మళ్లీ రాజకీయ చర్చలు వేడెక్కాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్(Shamshabad Airport) వరకు మెట్రోను కొనసాగించాలని నిర్మాణ బాధ్యతలు తీసుకున్న L&T సంస్థ కోరినా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ ప్రతిపాదనను తిరస్కరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ నిర్ణయం తర్వాతే ప్రభుత్వంతో L&T మధ్య విభేదాలు మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ వైఖరి వల్లే సంస్థ రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కేటీఆర్ మరో అంశాన్ని ప్రస్తావిస్తూ, మేడిగడ్డ ప్రాజెక్టుకు ఉచితంగా మరమ్మతులు చేయడానికి కూడా L&T ముందుకొచ్చిందని తెలిపారు. అయితే ఈ నిర్ణయం వల్ల రేవంత్రెడ్డికి కోపం వచ్చిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, మెట్రో ప్రాజెక్టుకు కేటాయించిన 250 ఎకరాల భూములపై కాంగ్రెస్ నేతల కన్ను పడిందని ఆరోపించారు. ఈ భూములపై లాభాపేక్షే అసలు సమస్య వెనుక ఉన్నదని కేటీఆర్ సూచించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మెట్రో ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే యోచనపై కేంద్రం విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు రద్దు చేయడం, కొత్తగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం అనేది భవిష్యత్లో నగర అభివృద్ధి ప్రణాళికలకు ఆటంకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. మెట్రో రైలు ప్రాజెక్టు వంటి భారీ మౌలిక వసతుల పనులు పారదర్శకంగా జరగకపోతే, పెట్టుబడిదారుల నమ్మకం దెబ్బతింటుందని ఆయన స్పష్టం చేశారు.