KTR Pressmeet: కేసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన, మోడీది సేల్స్ మెన్ పాలన!
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, జాతీయ పార్టీ బీజేపీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఉద్యోగుల బదిలీల జీవోను సవరించాలంటూ బీజేపీ చీఫ్ బండి దీక్షకు దిగడం, అరెస్ట్ కావడం, నడ్డా ఎంట్రీ ఇవ్వడం లాంటి విషయాలన్నీ
- By Balu J Published Date - 05:16 PM, Wed - 5 January 22
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, జాతీయ పార్టీ బీజేపీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఉద్యోగుల బదిలీల జీవోను సవరించాలంటూ బీజేపీ చీఫ్ బండి దీక్షకు దిగడం, అరెస్ట్ కావడం, నడ్డా ఎంట్రీ ఇవ్వడం లాంటి విషయాలన్నీ హాట్ టాపిక్ గా మారాయి. బండి అరెస్టును నిరసిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు సార్లు ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన జుగుప్సా కరమైన, హేయమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, నడ్డా అంటే నిన్నటి దాకా ఒక గౌరవం ఉండేది, అసంబద్ధ వ్యాఖ్యలతో నడ్డా స్థాయి బండి సంజయ్ తోసమానంగా మారిపోయారని విమర్శించారు.
బీజేపీ నేతల తీరు చూస్తే బీజేపీ ని బాక్వాస్ జుమ్లా పార్టీ గా పేరు మార్చొచ్చు అని ఎద్దేవా చేశారు. మోడీ ఈ ఏడేండ్లలో చేసిన మంచి పని ఒక్కటి లేదనీ, బీజేపీ కి సీబీఐ, ఈడీ, nia భాగస్వామ్య పక్షాలుగా మారాయని కేటీఆర్ ఆరోపించారు. 2022 కల్లా ఇండియా లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని మోడీ హామీ ఇచ్చారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని కూడా హామీ ఇచ్చారని, ప్రతి ఇంటికి టాయిలెట్ నల్లా అన్నాడు మోడీ.. కనీసం గుజరాత్ లోనైనా ఇచ్చావా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పంజాబ్ లో రైతుల నిరసన తో పీఎం మోడీ పంజాబ్ లో ఎన్నికల సభ ను రద్దు చేసుకున్నారని, ఇంతటి దౌర్భాగ్యం ఏ పీఎం కు రాలేదని, కేసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన, మోడీది సేల్స్ మెన్ పాలన అని ఆరోపించారు. నడ్డా అబద్ధాల అడ్డా కేర్ ఆఫ్ ఎర్రగడ్డ అని సైటర్స్ వేశారు.
అర పైసా ఉపయోగ పడే పని మోడీ దేశానికి ఏమైనా చేశారా? కాళేశ్వరం కేసీఆర్ కు ఎటిఎం అంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిజం ఎటిఎంయే.. ఏటీఎం అంటే అన్నదాతకు తోడుండే మెషిన్ అని వివరణ ఇచ్చారు. దిక్కుమాలిన బీజేపీ కి మా ప్రభుత్వ పథకాలే కాపీ కొట్టడానికి పనికొస్తున్నాయని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా నడ్డా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. నీతి ఆయోగ్ కున్న నీతి నడ్డా కు లేదనీ, ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా.. లక్షలాది మంది రైతుల గోస గుచ్చుకున్న చరిత్ర బీజేపీ కాదా అని ప్రశ్నించారు.
మేము ఉద్యమాల్లో పాల్గొని ప్రజలు ఎన్నుకుంటే గెలిచాం, బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి అత్యంత ఎక్కువ అని మీడియా సంస్థలు మేధావులు ఘోషిస్తున్నారని, దీని మరిచి నడ్డా అవినీతి గురించి మాట్లాడటమా? బండి సంజయ్ తన గుండు తానే పగులగొట్టుకుంటున్నాడు. బండి పోతే బండి వస్తుంది.. గుండు పోతే గుండు వస్తుందా? మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల స్థానికత కోసమే 317 జీఓ ఇచ్చామని, మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, బీజేపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు బెదిరేవారు ఎవ్వరూ లేరనీ, భయ పడితే తెలంగాణ వచ్చేదా అని, మార్కెట్ లో బీజేపీ కి భయపడే వారు ఎవరైనా ఉండొచ్చు, కానీ మేము కచ్చితంగా బీజేపీ వెంట పడుతూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం, దేంట్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో కేటీఆర్ వెంట వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, దాసరి మనోహర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణిలు ఉన్నారు.
Related News
Bhainsa : కేటీఆర్ ఫై ఉల్లిగడ్డలు , టమాటాలతో దాడి
ఆయన ప్రసంగిస్తుండగా.. కొంతమంది ఉల్లిగడ్డలు , టమాటాలు ఆయనపై విసిరారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది