BJP Chief Post : బీజేపీ చీఫ్ రేసు.. ఆ నలుగురి మధ్యే ప్రధాన పోటీ
తమిళనాడుకు చెందిన బీజేపీ(BJP Chief Post) నాయకురాలు వనతి శ్రీనివాసన్ పేరు సైతం పరిశీలనలో ఉందట.
- Author : Pasha
Date : 20-03-2025 - 8:10 IST
Published By : Hashtagu Telugu Desk
BJP Chief Post : బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ మరింత పెరిగింది. ఈ రేసులో తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అయితే పలువురు కీలక బీజేపీ నేతల నుంచి ఆయనకు టఫ్ ఫైట్ ఎదురవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు సన్నిహితులుగా పేరొందిన భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్లు కూడా బీజేపీ చీఫ్ పోస్టుపై ఆసక్తిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలుపు వెనుక వీరిద్దరి పాత్ర ఉంది. రాజకీయ వ్యూహ రచనలో భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ దిట్టలు. అందుకే వీరిద్దరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
Also Read :Earthquake: ఇండోనేషియాలో భూకంపం..ప్రజల్లో భయాందోళనలు!
అలా అయితే కిషన్రెడ్డికే ఛాన్స్
ఒకవేళ ఈసారి బీజేపీ చీఫ్ పదవిని దక్షిణాదికి ఇవ్వాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయితే.. కచ్చితంగా కిషన్ రెడ్డికి అవకాశం లభిస్తుంది. తమిళనాడుకు చెందిన బీజేపీ(BJP Chief Post) నాయకురాలు వనతి శ్రీనివాసన్ పేరు సైతం పరిశీలనలో ఉందట. ఇటీవలే ఢిల్లీ సీఎం పదవిని మహిళకు కేటాయించారు. బీజేపీ చీఫ్ పదవిని సైతం మహిళకే ఇవ్వాలని భావిస్తే.. వనతి శ్రీనివాసన్కు ప్రయారిటీ దక్కొచ్చు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలో వనతి శ్రీనివాసన్కు పార్టీ పగ్గాలను అప్పగించి.. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళలలో బలోపేతానికి బీజేపీ ప్రయత్నాలు చేయొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు బీజేపీ అధ్యక్షులుగా సేవలు అందించారు.
Also Read :Tomato Benefits: టమాటాలు అధికంగా తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్నా..
ఇక ఆర్ఎస్ఎస్ మద్దతు కలిగిన మాజీ ముఖ్యమంత్రులు మనోహర్లాల్ ఖట్టర్, శివరాజ్సింగ్ చౌహాన్ కూడా బీజేపీ చీఫ్ పోస్టు కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం వీరికి కేంద్ర ప్రభుత్వంలో అంతగా ప్రాధాన్యం లేదు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించిన పోటీలో వెనుకంజలోనే ఉండిపోయారు. ఏప్రిల్ రెండో వారంలోగా బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఖరారు చేయనున్నారట. ప్రాంతం, అనుభవం, విధేయతలను ప్రాతిపదికగా తీసుకొని ఈ పోస్టుకు నేతను ఎంపిక చేస్తారు.