Ameenpur Cheruvu : అమీన్పూర్ పెద్దచెరువులో జేఏసీ పేరిట దందా..!
Ameenpur Cheruvu : హైడ్రాకు బాధితులు అందించిన రసీదులు, వాట్సాప్ సందేశాల ఆధారంగా, దందాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు
- Author : Sudheer
Date : 01-03-2025 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
అమీన్పూర్ పెద్ద చెరువు (Ameenpur Cheruvu) పరిసరాల్లో అక్రమ వసూళ్లు (Illegal Collections) జరగడం పై హైడ్రా (Hydra) కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) నిర్ధారణను ఆసరాగా చేసుకుని, కొందరు ముంపు బాధితుల జేఏసీ పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రాకు బాధితులు అందించిన రసీదులు, వాట్సాప్ సందేశాల ఆధారంగా, దందాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
అక్రమ వసూళ్లు – బాధితుల ఆందోళన
అమీన్పూర్ చెరువులోని నీట మునిగిన లే ఔట్ల ప్లాట్ల యజమానుల నుంచి జేఏసీ పేరుతో కొందరు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. సభ్యత్వ ఫీజుగా రూ. 1,000, తర్వాత గజానికి రూ. 500 చొప్పున చెల్లించాలనే నిబంధన పెట్టి, ప్రభుత్వ శాఖలలో సర్దుబాట్లు చేస్తామని హామీ ఇస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. జేఏసీ ఛైర్మెన్గా పరిచయం చేసుకుంటూ, ప్రత్యేకంగా రసీదు పుస్తకాన్ని ముద్రించుకుని నండూరి సత్యనారాయణ అనే వ్యక్తి ఈ దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
సక్రమంగా ఎఫ్టీఎల్ నిర్ధారణ – ప్రభుత్వ చర్యలు
చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేపడుతోంది. గ్రామ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇమేజీలతో పరిశీలన జరిపి, సంబంధిత శాఖల సమీక్ష అనంతరం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని హైడ్రా వెల్లడించింది. జేఎన్టీయూ, ఐఐటీ కళాశాలల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, రెండుమూడు నెలల్లో ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తి చేస్తామని తెలిపారు. చెరువు పరిధిని బాగా అంచనా వేసి, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.