Telangana Rains : తెలంగాణలో నాలుగు రోజులు తేలికపాటి వానలు
Telangana Rains : సమ్మర్ సీజన్ ఆరంభంలోనే ఎండలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు.
- By Pasha Published Date - 08:01 AM, Mon - 18 March 24

Telangana Rains : సమ్మర్ సీజన్ ఆరంభంలోనే ఎండలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈనేపథ్యంలో భారత వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో ఈరోజు నుంచి 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోని(Telangana Rains) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈమేరకు ఐఎండీ ‘ఎల్లో అలర్ట్’ను జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
9 జిల్లాల్లో కురిసిన వాన
మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు కొనసాగుతున్న ద్రోణి ఎఫెక్టుతో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు తెలంగాణలోని 9 జిల్లాల్లో వందకుపైగా ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలాల్లో అత్యధికంగా 5 సెం.మీలు, కరీంనగర్ లో 4 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఆదివారం కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిశాయి. వర్షాల ఎఫెక్టుతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర టెంపరేచర్స్ డౌన్ అయ్యాయి.
Also Read : Putin Win : మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. నాటోకు ‘వరల్డ్ వార్’ వార్నింగ్
వచ్చే నాలుగు రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, వికారాబాద్, ములుగు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వానలు పడుతాయని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు కూలడం, చెట్లు పడిపోవడం వంటి జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.