Hyderabad : ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు.. హైదరాబాద్కు ‘జల’గండం!
Hyderabad : తెలంగాణలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ ఎండిపోతున్నాయి.
- By Pasha Published Date - 01:21 PM, Mon - 1 April 24

Hyderabad : తెలంగాణలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు సాగునీరు దొరకని పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ నీటికి కటకట ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్లో (Hyderabad) నీటి ఎద్దడి తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈశాన్య రుతుపవనాల ఎఫెక్టుతో తక్కువ వర్షపాతం సంభవించి తెలంగాణను కరువు ఛాయలు అలుముకునే ముప్పు ఉందంటూ మార్చి 27న వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది.
We’re now on WhatsApp. Click to Join
వ్యవసాయ శాఖ నివేదికలోని వివరాలివీ..
- సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏటా నమోదయ్యే వర్షపాతంలో 14 శాతం ఈశాన్య రుతుపవనాల ద్వారానే కురుస్తుంటుంది.
- ప్రతి సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో తెలంగాణలో ఈశాన్య రుతుపవనాల సగటు సాధారణ వర్షపాతం 113.20 మి.మీ. అయితే గతేడాది ఆ టైంలో రాష్ట్రంలో కురిసిన వర్షపాతం మాత్రం 53.45 మి.మీ మాత్రమే.
- ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో తెలంగాణలో 12 మి.మీ వర్షపాతం నమోదవుతుంటుంది. అయితే ఈ ఏడాది అదే టైంలో కేవలం 1.1 మి.మీ వర్షం కురిసింది.
- ప్రతి సంవత్సరం మార్చి నుంచి మే మధ్యకాలంలో తెలంగాణలో 3.9 మిమీ వర్షం కురుస్తుంటుంది. అయితే ఇప్పటివరకు కేవలం 0.2 మిమీ వర్షపాతం నమోదైంది.
- ఓవైపు హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరుల వినియోగం పెరుగుతూపోతోంది. కానీ మరోవైపు కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్, శ్రీదాపసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, మధ్యమానేరు, దిగువ మానేరు, కడెం రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గుతున్నాయి. కృష్ణా బేసిన్లోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేవు. దీంతో ఎగువ భాగం నుంచి నీరు వచ్చి చేరక.. జలాశయాలు ఖాళీ అవుతున్నాయి.
Also Read :Kejriwal : 14 రోజుల జ్యుడిషయల్ కస్టడీ.. తీహార్ జైలుకు కేజ్రీవాల్
- 2024 మార్చి 27 నాటికి తెలంగాణలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లలో కలుపుకొని దాదాపు 287.06 టీఎంసీల నీటి వనరులు ఉన్నాయి. గతేడాది ఇదే టైంలో ఆయా జలాశయాల్లో నీటి నిల్వ అత్యధికంగా 434.13 టీఎంసీలు ఉండేది. అంటే రిజర్వాయర్లలోని నీటిమట్టాలు గతేడాది కంటే ఈసారి సగానికి సగం తగ్గిపోయాయి.,
- ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు భూగర్భ జలాలపై ఆధారపడక తప్పడం లేదు. అతి వినియోగం వల్ల రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు కూడా తగ్గుతున్నాయి.
- ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 8.70 అడుగులకు చేరుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 7.34 అడుగులుగా ఉండేది.