Bandi Sanjay : బండి సంజయ్ వ్యాఖ్యలతో హుజురాబాద్ బిజెపి శ్రేణులంతా ఈటెల ఇంటికి పరుగులు
Bandi Sanjay : ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు తర్వాత సమన్వయం కొంత తక్కువగానే కనిపిస్తోంది. ఇక ఇలాంటి వర్గపోరు పార్టీ కార్యకర్తల ధైర్యాన్ని కుదించవచ్చని నేతలే అంటున్నారు
- By Sudheer Published Date - 12:20 PM, Sat - 19 July 25

తెలంగాణ బీజేపీలో నేతల (BJP Leaders) మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. తాజాగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలు హుజూరాబాద్ బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపాయి. ఎంపీ ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా హుజూరాబాద్(Huzurabad)లో కొందరు పనిచేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో హుజూరాబాద్లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తమ మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున హుజూరాబాద్ బీజేపీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్లోని శామీర్పేటలో ఉన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajendar) ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. “తమను స్థానికంగా ఇబ్బంది పెడుతున్నారంటూ” తమపై పార్టీ అంతర్గతంగా ఒత్తిడులు పెరుగుతున్నాయని, తాము ఇక బీజేపీలో ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నామని తెలిపారు. ఈటల ముందు ఆవేశంగా మాట్లాడిన పలువురు కార్యకర్తలు పార్టీకి ఇప్పటికీ విశ్వాసంగా ఉన్నామని, కానీ ఈ తరహా ఆరోపణలు తమ మనోబలాన్ని దెబ్బతీస్తున్నాయని వాపోయారు.
DMK Legacy Loss: కరుణానిధి కుమారుడు ముత్తు కన్నుమూత
బండి సంజయ్, ఈటల మధ్య ఇప్పటికే ఉన్న పొలిటికల్ గ్యాప్ ఇప్పుడు మరింత పెరుగుతున్న సూచనలుగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎంపీ టికెట్ విషయంలోనూ గతంలో ఈటలతో బండి సంజయ్ అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈటల శ్రేణులు మరోసారి యాక్టివ్ అయ్యాయి. ఇక హుజూరాబాద్ బీజేపీ ఆంతర్యం పూర్తిగా ఇరు నేతల మధ్య ఉన్న రాజకీయ అసమరసతలపై ఆధారపడి ఉన్నట్లే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పరిణామాలన్నీ పార్టీపై ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు తర్వాత సమన్వయం కొంత తక్కువగానే కనిపిస్తోంది. ఇక ఇలాంటి వర్గపోరు పార్టీ కార్యకర్తల ధైర్యాన్ని కుదించవచ్చని నేతలే అంటున్నారు. ఈటల – బండి మధ్య తలెత్తిన ఈ చిచ్చు ఇక్కడితో ఆగుతుందా, లేక మరింత రాజుకుతుందా అనేది ఇకపై కనిపించాల్సిన విషయం. పార్టీకి మేలు చేయాలంటే నాయకులు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఒకే తీర్పుతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.