Gummadi Narsaiah : సీఎం రేవంత్ తో గుమ్మడి నర్సయ్య భేటీ
Gummadi Narsaiah : ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వ సహకారం అవసరమని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు
- By Sudheer Published Date - 05:26 PM, Tue - 18 March 25

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)తో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (EX MLA Gummadi Narsaiah) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా విజయవంతం కాలేకపోయారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో, తానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గుమ్మడి నర్సయ్య గతంలో సీపీఐ (ఎం) తరపున ఇల్లందు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత ఇక్కడి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించినా అవకాశం దొరకలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చివరికి భేటీ అయ్యేందుకు అవకాశం లభించడంతో, నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇల్లందులో ఆర్థిక సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలు, ప్రజల మౌలిక సదుపాయాల గురించి సీఎం రేవంత్కు వివరించారు.
ఈ భేటీ నేపథ్యంలో ఇల్లందు అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపు, ప్రభుత్వ ప్రాధాన్యత తదితర అంశాలపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వ సహకారం అవసరమని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీంతో ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధిపై త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.