Govt Schemes : వారందరికీ ప్రభుత్వ పథకాలు కట్ – కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 'ఫేస్ రికగ్నిషన్' (ముఖ గుర్తింపు) విధానాన్ని అన్ని పథకాలకు వర్తింపజేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలని, అదే సమయంలో అనర్హులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు
- Author : Sudheer
Date : 04-03-2026 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
Govt Schemes : తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పెంచేందుకు మరియు ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘ఫేస్ రికగ్నిషన్’ (ముఖ గుర్తింపు) విధానాన్ని అన్ని పథకాలకు వర్తింపజేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలని, అదే సమయంలో అనర్హులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే ఆసరా పింఛన్లలో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయడం ద్వారా దాదాపు 3 లక్షల మంది అనర్హులను గుర్తించి తొలగించగలిగామని సీఎం వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, కూలీలు బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు పడక పింఛన్లు మరియు ఇతర లబ్ధి పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఫేస్ రికగ్నిషన్’ సాంకేతికతను తీసుకువస్తున్నారు. దీనివల్ల లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సులభంగా గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి సాయం పొందవచ్చు. కేవలం పింఛన్లకే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మరియు రేషన్ కార్డుల పంపిణీ వంటి కీలక పథకాలన్నింటికీ ఈ విధానాన్ని అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను సమీప వైద్య కళాశాలలతో అనుసంధానం చేయడం ద్వారా వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని కూడా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు.
ఈ సంస్కరణల అమలులో ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సభల ద్వారా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరిందో ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు పెండింగ్ బిల్లులను ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని, తద్వారా విద్యావ్యవస్థలో నాణ్యతను కాపాడాలని ఆదేశించారు. సుమారు 44 లక్షల మంది పింఛన్ దారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, అనర్హుల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూడటమే ఈ ‘ప్రగతి ప్రణాళిక’ ముఖ్య ఉద్దేశం.