KCR: తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ దాశరథి
దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు.
- Author : Balu J
Date : 22-07-2023 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు శ్రీ దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డగా సీఎం కొనియాడారు.
సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష కృషి చేసి తెలుగు భాషా సాహిత్యాన్ని దాశరథి సుసంపన్నం చేశారని సీఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా దాశరథి కృష్ణామాచార్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడంతో పాటు, తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కవులకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నదని సీఎం తెలిపారు. 2023 సంవత్సరానికిగాను శ్రీ అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.
దాశరథి కృష్ణమాచార్యుల ఆశయాల మేరకు ముందుకు సాగుతున్నామని సీఎం అన్నారు. తెలంగాణను సాధించడంలోనూ, రాష్ట్ర ప్రగతిని కొనసాగించడంలోనూ వారి స్ఫూర్తి ఇమిడి వున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక అస్తిత్వంతో, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని సీఎం అన్నారు.