Revanth Reddy: ఢిల్లీకి చేరిన ₹. 30 కోట్ల ఫిక్సింగ్, టీఆర్ఎస్ తో రేవంత్ కుమ్మక్కు..!
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడని ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి.
- By CS Rao Published Date - 05:17 PM, Sat - 12 November 22
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడని ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి. సుమారు ₹. 30 కోట్లు తీసుకుని టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు సహకరించాడని ఆరోపణ చేస్తూ రాతపూర్వక ఫిర్యాదు వెళ్లింది. ఆయనతో పాటు ఒక ఎమ్యెల్యే సుమారు రూ. 2కోట్లను పంచుకుని ఫార్చునర్ కారు కొనుగోలు చేసినట్టు కొన్ని ఆధారాలను జత చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కా జడ్సన్ పంపిన రెండు పేజీల లేఖ ఏఐసీసీకి చేరింది. దానిపై ఏఐసీసీ ఆరా తీస్తుందని ఢిల్లీ వర్గాల నుంచి తెలుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో చలమల క్రిష్ణారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని తొలుత రేవంత్ రెడ్డి ఏఐసీసీని కోరారు. ఆ తరువాత అందరి అభిప్రాయం మేరకు పాల్వాయి స్రవంతిరెడ్డికి టిక్కెట్ ఇవ్వడం జరిగింది. దీంతో రూ. 30 కోట్లు తీసుకుని టీఆర్ఎస్ పార్టీకి పీసీసీ చీఫ్ సహకరించాడని బక్కా జడ్సన్ చేసిన ప్రధాన ఆరోపణ. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బావమర్దికి ఉన్న వ్యాపార సంబంధాలను లేఖలో పొందుపరిచారు. గతంలో కల్వకుంట్ల కుటుంబం వ్యాపారాల్లో ఏ విధంగా రేవంత్ రెడ్డి సంబంధాలను కలిగి ఉన్నాడో తెలియచేస్తూ కొన్ని కంపెనీల పేర్లను ప్రస్తావించారు. ఆయన బామ్మర్ది సూదిన సృజన్ రెడ్డి , కవిత వ్యాపార లావాదేవీల గురించి తెలియచేశారు. రాబోవు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో కలిసి పీసీసీ చీఫ్ పనిచేస్తాడని జడ్సన్ ఆరోపించారు.
Also Read: Modi Warns KCR: కేసీఆర్ పై మోడీ అటాక్.. అవినీతి, కుటుంబ పాలన అంటూ వ్యాఖ్యలు!
ఒక వేళ ఆయన మీద చర్యలు తీసుకోకపోతే 2023, 2024 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్లను బహిరంగంగా అమ్ముకుంటాడని ఆ లేఖలో పొందుపరిచారు. మునుగోడులో ఆయన చెప్పిన అభ్యర్థి చలమలకు టిక్కెట్ ఇచ్చి ఉంటే హుజురాబాద్ అభ్యర్థికి వచ్చిన 3వేల ఓట్లు మాత్రమే వచ్చేవని అభిప్రాయపడ్డారు. గతంలో స్రవంతి రెడ్డి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసే 27వేల ఓట్లు వచ్చాయని, అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే కేవలం 23వేల ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. ఇదంతా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలపడం వలన జరిగిన నష్టంగా ఏఐసీసీకి తెలయచేస్తూ మల్లిఖార్జున ఖర్గేకు జడ్సన్ లేఖ రాయడం గమనార్హం.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మల్లిఖార్జున ఖర్గే కు పంపిన లేఖను కొన్ని సోషల్ మీడియా, మీడియా సంస్థలకు అందచేయడంతో పాటు ఇంటర్వ్యూలను కూడా జడ్సన్ ఇచ్చారు. దీంతో పీసీసీ ఆగ్రహించి ఆయనకు షోకాజ్ నోటీసును జారీ చేసింది. దానికి తిరుగు సమాధానం ఇచ్చారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణలకు పశ్చాతాపం తెలియచేస్తూ షోకాజ్ నోటీస్ కు తిరుగు సమాధానం ఇచ్చారు. అయితే, తాజాగా కాంగ్రెస్ లో సీనియర్ లీడర్, ట్రబుల్ షూటర్ గా పేరున్న ఏకే ఆంటోనీకి మరో ఫిర్యాదు రేవంత్ రెడ్డి మీద అందినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం మేరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి రూ.య 30కోట్లు రేవంత్ తీసుకున్నాడని ఆంటోనీకి ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. మొత్తం మీద ఫిక్సింగ్ పాలిటిక్స్ మునుగోడు ఫలితాన్ని తారుమారు చేసిందని, కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.
Also Read: Modi Go Back: మోడీ గో బ్యాక్.. నో ఎంట్రీ ఇన్ తెలంగాణ!
మునుగోడులో మూడు ప్లేస్ లో నిలవడాన్ని గొప్పగా రేవంత్ రెడ్డి చెప్పడాన్ని జడ్సన్ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఓటమి మీద సమీక్ష కూడా చేయకుండా 23వేల ఓట్లు రావడాన్ని ఘనంగా చెప్పుకోవడం రేవంత్ రెడ్డి ఫిక్స్ రాజకీయాలకు నిదర్శనమని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ మాదిరిగా నడుపుతోన్న ఆయన్ను తప్పించాలని అభ్యర్థిస్తూ ఏఐసీసీకి లేఖలు వెళ్లడం తెలంగాణ కాంగ్రెస్ మరో సంక్షోభం దిశగా వెళుతోందని స్పష్టం అవుతోంది.