బిఆర్ఎస్ ఆ తప్పు చేయడం వల్లే అధికారం కోల్పోయింది – కవిత
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ చేసిన తప్పుల నుంచే రేవంత్ రెడ్డి పాఠాలు నేర్చుకోవాలని, లేదంటే అదే గతి పడుతుందని హెచ్చరించారు
- Author : Sudheer
Date : 12-02-2026 - 5:08 IST
Published By : Hashtagu Telugu Desk
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ప్రజాస్వామ్య విలువలను విస్మరించడమేనని కవిత స్పష్టం చేశారు. పదేళ్ల పాలనలో ఉద్యమకారుల ఆకాంక్షలను, నీళ్లు, నిధులు, నియామకాలనే ప్రాథమిక లక్ష్యాలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజల గొంతుకను వినకపోవడం, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తగ్గడం వంటి తప్పుల వల్లే ప్రజలు మార్పును కోరుకున్నారని ఆమె విశ్లేషించారు. స్వయంగా పార్టీ ముఖ్య నాయకురాలిగా ఉండి, అధికార పీఠం చేజారడానికి గల కారణాలను ఇంత బహిరంగంగా ఒప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ చేసిన తప్పుల నుంచే రేవంత్ రెడ్డి పాఠాలు నేర్చుకోవాలని, లేదంటే అదే గతి పడుతుందని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి కేవలం రాజకీయ ప్రతీకారాలకు ప్రాధాన్యత ఇస్తే, బిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ ప్రభుత్వమైనా కుప్పకూలక తప్పదని ఆమె హెచ్చరించడం ద్వారా తన రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు.