KCR-KTR: ప్లీనరీలో కేటీఆర్ కీలకం…కేసీఆర్ ప్లాన్ ఇదేనా..?
టీఆరెస్ పార్టీకి సుప్రీం ఎవరంటే...అది ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మాత్రమే.
- By Hashtag U Published Date - 07:48 AM, Wed - 27 April 22
టీఆరెస్ పార్టీకి సుప్రీం ఎవరంటే…అది ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మాత్రమే. పార్టీలోనూ…ప్రభుత్వంలోనూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా…ఏ వ్యూహం అమలు చేయాలన్నా అది కేసీఆర్ కు మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్లుగా కనిపిస్తోంది. పార్టీకి సంబంధించినంత వరకు కీలక బాధ్యతలన్నీ కూడా…ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మంత్రి కేటీఆర్ తీసుకుంటున్నారు. అధికారులతో, పార్టీ నాయకులతో కీలకమైన సమీక్షలన్నీ చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో…తెలంగాణకు సంబంధించిన అంశాలన్నింటిపై కేసీఆర్ స్థానంలో కేటీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం భాగ్యనగరంలో జరగనున్న టీఆరెస్ 21వ ఆవిర్భావ దినోత్సవంలో ఎన్నికల శంఖారావాన్ని వినిపించేందుకు సిద్దమైంది పార్టీ. ఈ ప్లీనరీలో 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోకసభ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కొవాలన్న దానిపై వ్యూహాన్ని రచించనున్నారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. అదే సమయంలో మంత్రి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మంత్రి కేటీఆర్ పురపాలక పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ వంటి కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. మీడియాకు ఇంటర్య్వూలు ఇవ్వడం…తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేయడంలో కేటీఆర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. విభజన రాజకీయాలు, అభివృద్ధి, ఆస్తులను బుల్డోజింగ్ చేయడం వంటి సమస్యలపై బీజేపీ,కాంగ్రెస్ లను ఎదుర్కొనడంలో కేటీఆర్ ముందున్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేటీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ ప్లీనరీ హైటెక్స్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మంత్రి కేటీఆర్ చక్కబెడుతున్నారు. మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులకు ఇప్పటికే విభాగాల వారీగా బాధ్యతలను అప్పగించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేటీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటి నుంచే వ్యూహరచన జరుగుతోంది.
నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులను గుర్తించి వారికి కీలక బాధ్యతలను అప్పగించే అంశంలో కేటీఆర్ అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలను చక్కపెడుతుండగా…కేటీఆర్ తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ ముందు చూపు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఎప్పుడో ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ అప్పగించాల్సి ఉన్నా…ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉండటంతో తన నిర్ణయాన్ని వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. కానీ రానున్న ఎన్నికల్లో టీఆరెస్ విజయం సాధిస్తే కేటీఆర్ ను సీఎంగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఇప్పటి నుంచే పార్టీలోనూ , ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ కీలకమైన నాయకుడిగా కేటీఆర్ ను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి బుధవారం జరిగే ప్లీనరీలో కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తారా…? లేదా అనేది.
Tags
Related News
KTR: మొగిలయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటాను.. హామీ ఇచ్చిన కేటీఆర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య సంగీత విద్వాంసుడు దర్శనం మొగిలియ్యకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.