Team India Pacers: భారత పేసర్ల సరికొత్త రికార్డ్
ఆసియాకప్ ఆరంభ మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు.
- By Naresh Kumar Published Date - 11:02 PM, Sun - 28 August 22

ఆసియాకప్ ఆరంభ మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. సమిష్టిగా రాణించిన పాక్ ను 147 పరుగులకే కట్టడి చేశారు. చాలా కాలం తర్వాత భువి ఫామ్ లోకి రాగా… హార్థిక్ పాండ్యా తన జోరు కొనసాగించాడు. దీంతో భారీస్కోరు చేసేందుకు ప్రయత్నించిన పాక్ ను వీరిద్దరూ దెబ్బకొట్టారు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో భారత్ పేసర్లు అరుదైన రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్లో టీమిండియా తీసిన 10 వికెట్లు పేసర్లే పంచుకున్నారు. భువనేశ్వర్ కుమార్ 4, హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్ 2, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశారు. టీమిండియా తరపున టి20 క్రికెట్లో అన్ని వికెట్లు పేసర్లు తీయడం ఇదే మొదటిసారి. ప్లొరిడాలో వెస్టిండీస్తో జరిగిన టి20 మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ లో అన్ని వికెట్లు స్పిన్నర్లు పడగొట్టారు. ఇక భువనేశ్వర్ కుమార్ టి ట్వంటీల్లో పాకిస్తాన్పై కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ 4 ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసియాకప్లో పాకిస్తాన్పై రెండోసారి మూడు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన హార్దిక్ 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంతకముందు 2016లో 3.3 ఓవర్లలోనే 8 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.