SA Vs IND : ఆ ఐదే ఓటమికి కారణం..
సౌతాఫ్రికా టూర్ ను విజయంతో మొదలుపెట్టిన టీమిండియా ఓటమితో ముగించింది. టెస్ట్ సిరీస్ లో ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచినా వన్డే సిరీస్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది.
- By Hashtag U Published Date - 12:53 PM, Mon - 24 January 22
సౌతాఫ్రికా టూర్ ను విజయంతో మొదలుపెట్టిన టీమిండియా ఓటమితో ముగించింది. టెస్ట్ సిరీస్ లో ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచినా వన్డే సిరీస్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో భారత ఓటమికి కారణాలను విశ్లేషిస్తే… ప్రధానంగా మిడిలార్డర్ వైఫల్యమే కొంపముంచిందని చెప్పొచ్చు. వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి రాణించినా…. మిడిలార్డర్ లో ఏ ఒక్కరూ రాణించలేదు. పంత్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేసినా ఒక మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ , సూర్యకుమార్ యాదవ్ కూడా ఆకట్టుకోలేదు. వన్డేల్లో ఎప్పుడైనా పార్టనర్ షిప్స్ అందులోనూ మిడిలార్డర్ కీలకమనే విషయం చెప్పక్కర్లేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భారత జట్టులో ఇదే లోపించింది. ఈ కారణంగానే గెలవాల్సిన మ్యాచ్ లను చేజార్చుకుంది.
అటు మిడిల్ ఓవర్లలో బౌలర్ల పేలవ ప్రదర్శన మరో కారణం. మిడిల్ ఓవర్స్ లో మన బౌలర్లు అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. ప్రత్యర్థి బ్యాటర్లు నిలదొక్కుకున్నది ఇక్కడే. భారత బౌలర్ల బలహీనతను సొమ్ము చేసుకున్న సఫారీ జట్టు మిడిల్ ఓవర్స్ లో ఆచితూచి ఆడుతూ భారీస్కోర్లు సాధించింది. అటు భారత బ్యాటర్ల షాట్ల ఎంపిక కూడా ఓటమికి కారణమైంది. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకున్నారు. ముఖ్యంగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రాంగ్ టైమ్లో చాలా బాధ్యతారహిత్యమైన షాట్లు ఆడుతూ వికెట్ సమర్పించుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ కూడా ఇలానే చెత్తషాట్లతో ఔటయ్యారు. ఇదిలా ఉంటే తుది జట్టు ఎంపికలోనూ తప్పిదాలు కొంపముంచాయి. ఐదుగురు బ్యాటర్లతోనే బరిలోకి దిగడం, తుది జట్టు వెంకటేశ్ అయ్యర్ లాంటి అనుభవం లేని ఆల్ రౌండర్ ను ఆడించడంతో బ్యాటింగ్ భారం టెయిలెండర్లపై పడింది.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా కెఎల్ రాహుల్ పేలవమైన కెప్టెన్సీ మరో కారణంగా చెప్పొచ్చు. రోహిత్ శర్మ గాయంతో దూరమవడంతో రాహుల్ పగ్గాలు అందుకున్నాడు. సారథిగా వచ్చిన అవకాశాన్ని నిరూపించుకుంటాడనుకుంటే పూర్తిగా విఫలమయ్యాడు. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్ ఎక్కడా కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. కోహ్లీతో పోల్చి చూస్తే సహచరుల్లో ఎనర్జీ నింపలేకపోయాడనేది మాజీల మాట. ఏదైతేనేం సౌతాఫ్రికా టూర్ భారత క్రికెట్ జట్టుకు ఓ గుణపాఠంగా భావిస్తున్నారు. ఈ తప్పిదాలు వీలైనంత త్వరగా సరిదిద్దుకోకుంటే పరాజయాల బాట వీడడం కష్టమే.
Tags
Related News
India Reach Finals: ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ జట్టు.. ఉదయ్ సహారన్ బృందం చరిత్ర సృష్టిస్తుందా..?
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2024లో భారత జట్టు ఫైనల్ (India Reach Finals)కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.