Legends Cricket League 2022 : యూసఫ్ పఠాన్ విధ్వంసం
లెజెండ్స్ క్రికెట్ లీగ్ కు ఘనమైన ఆరంభం లభించింది. తొలి మ్యాచ్ లో రిటైరయిన ఆటగాళ్ళు పరుగుల వరద పారించారు.
- By Hashtag U Published Date - 02:18 PM, Fri - 21 January 22
లెజెండ్స్ క్రికెట్ లీగ్ కు ఘనమైన ఆరంభం లభించింది. తొలి మ్యాచ్ లో రిటైరయిన ఆటగాళ్ళు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఇండియా మహారాజా జట్టు తరపున యూసఫ్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. ఆసియా లయన్స్ పై భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజా జట్టు ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్ మెరుపు ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. కేవలం 40 బంతుల్లోనే 80 పరుగులు చేసాడు.
యూసుఫ్ పఠాన్ తొలి బంతి నుంచే ఆసియా లయన్స్ బౌలర్లపై విరుచుకుపడి కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు మహ్మద్ కైఫ్ తనదైన శైలిలో స్ట్రైక్ మార్చుతూ కనిపించాడు. యూసుఫ్ పఠాన్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సమయంలో అనూహ్యంగా రనౌటైనప్పటకీ.. అప్పటికే మ్యాచ్ ఇండియా మహారాజా వైపు మొగ్గింది. చివర్లో, అతని సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ 10 బంతుల్లో 21 పరుగులు చేసి 5 బంతులు మిగిలి ఉండగానే ఇండియా మహారాజాతో విజయాన్ని అందించాడు.
ఇదిలా ఉంటే యూసఫ్ పఠాన్ చాలా కాలంగా ఐపీఎల్ లో కూడా ఆడడం లేదు. వేలంలో అతన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో గత ఏడాదే అన్ని ఫార్మేట్లకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ బరోడా ఆల్ రౌండర్ భారత్ తరపున 57 వన్డేలు, 22 టీ ట్వంటీలు ఆడాడు. ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ , కోల్ కతా జట్లకు ప్రాతినిథ్యం వహించిన యూసఫ్ పఠాన్ 174 మ్యాచ్ లు ఆడాడు.