AP : వైఎస్సార్ కాపు నేస్తం సొమ్ము రిలీజ్ చేసిన జగన్
నాలుగో విడతలో భాగంగా అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ అందజేశారు
- Author : Sudheer
Date : 16-09-2023 - 12:41 IST
Published By : Hashtagu Telugu Desk
‘వైయస్ఆర్ కాపు నేస్తం’ (YSR Kapu Nestham) నాలుగో విడతలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేసారు. ‘ వైయస్ఆర్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. ఈరోజు నాలుగో విడతలో భాగంగా అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ అందజేశారు. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ (CM Jagan) మాట్లాడుతూ.. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామని ..అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నామని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. పేద, కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యమని అన్నారు. నాలుగు లక్షల మంది కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధిపొందినట్లు తెలిపారు. లంచాలకు అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పుకొచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేయలేదని , కులం, మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామ్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. అలాగే కేబినెట్లో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం జగన్.. ఇది ప్రజలందరీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
Read Also : AP : ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన విస్తృత స్థాయి సమావేశం