Celebral Palsy: సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు ఎలా ఉంటాయి…?
సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి చిన్నారుల్లో పుట్టుకకు ముందే ఏర్పడి అనారోగ్య సమస్యల కారణంగా సోకుతుంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల...
- By Hashtag U Published Date - 12:13 PM, Wed - 2 March 22

Cerebral Palsy: సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి చిన్నారుల్లో పుట్టుకకు ముందే ఏర్పడి అనారోగ్య సమస్యల కారణంగా సోకుతుంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల…ఈ వ్యాధితోనే చనిపోవడంతో…ఈ వ్యాధి గురించి మరోసారి చర్చ మొదలైంది. అసలీ సెరిబ్రల్ పాల్సీ వ్యాధి లక్షణాలు ఏవిధంగా ఉంటాయి. చిన్నారుల్లో ఈ వ్యాధి సోకడానికి గల కారణాలు ఏమై ఉంటాయి. ఈ వ్యాధి ప్రభావాలు ఏవిధంగా ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వ్యాధి గురించి సింపుల్ గా చెప్పాలంటే…తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డ మెదడుకు ప్రాణ వాయువైన ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే…ఆ బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమలోనే ఆ బిడ్డకు ఎదురయ్యే తీవ్రమైన అనారోగ్య సమస్యలనే సెరిబ్రల్ పాల్సీ అని అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిలో మూడు రకాలు ఉంటాయి. 1. స్పాటిక్ సెరిబ్రల్ పాల్సీ, 2. ఎథిటాయిడ్ సెరిబ్రల్ పాల్సీ, 3. ఎటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ. ఇందులో ఒక్కో రకం సెరిబ్రల్ పాల్సీకి ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
1. స్పాటిక్ సెరిబ్రల్ పాల్సీ: ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో రక్త ప్రసరణలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాళ్లు, చేతులు బిగుసుకుంటాయి. కదలికలు ఉండవు.
2. ఎథిటాయిడ్ సెరిబ్రల్ పాల్సీ: ఇది సోకిన పిల్లలకు శరీరంతో సంబంధం లేకుండా కదలికలు ఉంటాయి.
3. ఎటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ: ఇది సోకినట్లయితే పిల్లల్లో గ్రహణ శక్తి తగ్గిపోతుంది. చిన్నారుల శరీర ఎదుగుదలలో బ్యాలెన్స్ తప్పుతుంది.
ఈ మూడు రకాల సెరిబ్రల్ పాల్సీ లక్షణాల్లో ఏదో ఒకటే సోకుతుందా అంటే…అది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కోసారి రెండు లేదా మూడు రకాలు కలిసి కూడా సోకే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఫిజియోథెరపీతో కాస్త ఉపశమనం కలిగించడం తప్ప…సెరిబ్రల్ పాల్సీ సోకిన వారికి పూర్తిచికిత్స కష్టమే అన్న అభిప్రాయలు ఉన్నాయి. ఈ విషయంలో బాధిత చిన్నారుల గురించి కుటుంబ సభ్యులు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అందుకు అనుగుణంగా ఇంట్లో వాతావరణం కల్పించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇలాంటి అరుదైన వ్యాధి సోకి మరణించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల పరిస్థితి గురించి చూసినట్లయితే….జైన్ కు కూడా పుట్టుకతో సెరిబ్రల్ పాల్సీ వ్యాధి ఉందని నాదెళ్ల కుటుంబీకులు తెలిపారు. సరిగ్గా నడవలేడు, చూడలేడు, మాట్లాడలేడు…ఈ విధంగా 26 సంవత్సరాల జీవితాన్ని పూర్తిగా వీల్ చైర్లోనే గడిపాడు. కుమారుడి పరిస్థితి ఈ విధంగా ఉన్నా…నాదెళ్ల కుటుంబం గుండె ధైర్యం చేసుకుని ముందుకు సాగింది. ఉన్నంత కాలం తమ కుమారుడిని బాగా చూసుకునేందుకు నాదేళ్ల దంపతులు చాలా ప్రయత్నించారు.