Women’s Day: మహిళా దినోత్సవ సంబరాలకు ‘కేటీఆర్’ పిలుపు
కేసీఆర్ సర్కార్ మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో...
- By Hashtag U Published Date - 07:05 PM, Thu - 3 March 22
కేసీఆర్ సర్కార్ మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో… అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) గురువారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరిట సంబరాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR) దక్కుతుందన్నారు కేటీఆర్. ఇలా చేయడం దేశంలోనే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. సుమారు 11 లక్షల మంది మహిళలకు కేసీఆర్ కిట్ పథకం అమలైందని తెలిపారు. ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో… ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
6న కేసీఆర్ కు రాఖీ కట్టడంతో సంబరాలు ప్రారంభం:
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీన పార్టీ మహిళా నాయకురాళ్లు సీఎం కేసీఆర్ కు రాఖీలు కట్టాలని కేటీఆర్ సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు:
గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలతో పాటు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన రాజకీయ అనుభవంలో ఎదురైన క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం ఇస్తున్న గొప్ప పాలకుడు మన సీఎం కేసీఆర్ అని కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపిస్తూ… అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారని ఆయన కొనియాడారు. అందులో భాగంగానే మహిళా సంక్షేమానికి సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆడబిడ్డలకు నీటి కష్టాలను దూరం చేసేందుకు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసి, విజయవంతం చేశారు. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ పథకం అమలు చేశామన్నారు. ఈ పథకం అమలుతో మాతా శిశు మరణాలు తగ్గాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయని కేటీఆర్ గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి కార్యక్రమం ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది లబ్ధిదారులకు రూ. 9,022 కోట్లను పెళ్లి కానుకగా అందజేశామన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తోందని… వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు.
విద్యాశాఖలోని కార్యక్రమాలపై కేటీఆర్:
విద్యాశాఖలోనూ అద్భుతమైన కార్యక్రమాలను కేసీఆర్ సర్కార్ చేపట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. 70 లక్షల హెల్త్, హైజిన్ కిట్లను విద్యార్థినులకు అందించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇతరులు ‘బేటీ బచావో… బేటీ పడావో’ అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో… నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం మనదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ మహిళల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
Related News
KTR : కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం : కేటీఆర్
ఈసారి కేంద్రంలో ఇండియా కూటమికి కానీ, ఎన్డీయే కూటమికి గానీ ఆధిక్యం రాదని.. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్(KTR) జోస్యం చెప్పారు.