Teenamar Mallanna New Party : తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? పార్టీ పేరు ఇదేనా..?
తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తీన్మార్ మల్లన్న ఈసీకి అప్లై చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే
- Author : Sudheer
Date : 07-09-2023 - 10:44 IST
Published By : Hashtagu Telugu Desk
తీన్మార్ మల్లన్న (Teenamar Mallanna)..కొత్త పార్టీ (Political Party) పెడుతున్నట్లు కొద్దీ రోజులుగా ప్రచారం అవుతున్నప్పటికీ..అది కార్యరూపం దాల్చకపోయేసరికి ఇదంతా ఫేక్ అని అంత మాట్లాడుకున్నారు. కానీ అది నిజమే అని పక్కాగా తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా తెలంగాణ నిర్మాణ పార్టీ (Telangana Nirmana Party) పేరుతో తీన్మార్ మల్లన్న ఈసీకి అప్లై చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోగా తెలియజేయాలని ఈసీ వెబ్సైట్ లో పెట్టింది. గత ఏప్రిల్ లో పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం (Telangana 2023 Elections)లో మరో మూడు నెలల్లోని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ (BRS) తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధం కాగా.. కాంగ్రెస్ (Congress) మరియు బీజేపీ (BJP) పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో తీన్మార్ మల్లన్న సైతం సొంత పార్టీ తో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. 1982, జనవరి 17న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పలు న్యూస్ చానెల్స్ లలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012లో వి6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ద్వారా నవీన్ కాస్త తీన్మార్ మల్లన్నగా సుపరిచితుడయ్యాడు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత 2019లో జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యాడు.
Read Also : Chandrababu – KCR : కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు
7 డిసెంబర్ 2021న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. కానీ ఆ తర్వాత వెంటనే బిజెపి నుండి బయటకు వచ్చారు. ప్రస్తుతం క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తో పాటు మరో న్యూస్ పేపర్ ను రన్ చేస్తున్నాడు. రాజకీయాల్లో తనకంటూ స్థానం సంపాదించుకోవాలని మల్లన్న ఎంతగానో కష్టపడుతున్నాడు కానీ అదృష్టం కలిసిరావడం లేదు. మరి ఇప్పుడు సొంత పార్టీ ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. ప్రజలు ఈసారైనా మల్లన్న కు సపోర్ట్ ఇస్తారా..? లేదా అనేది చూడాలి.