Revanth Reddy: రెవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. అసలు కారణం అదే..!
- By HashtagU Desk Published Date - 09:56 AM, Tue - 22 March 22

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి ఆయన హైకమాండ్కు వివరించనున్నారని సమాచారం. ఈ నేపధ్యంలో ఈరోజు పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అసంతృప్త నేతలు సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అధినాయకత్వానికి రేవంత్ రెడ్డిత ఫిర్యాదు చేయనున్నారు. మొదట ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. జగ్గారెడ్డి తాను పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం, స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పడంతో, సోమవారం జగ్గారెడ్డి ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డి సూచనలు తీసుకోనున్నారని సమాచారం.