Ola Electric Scooter:1,400 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రీకాల్ .. ఎందుకంటే..
ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిన పలు ఘటనలు ఇటీవల చోటుచేసుకున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ అప్రమత్తం అయింది.
- Author : Hashtag U
Date : 24-04-2022 - 6:08 IST
Published By : Hashtagu Telugu Desk
ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిన పలు ఘటనలు ఇటీవల చోటుచేసుకున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ అప్రమత్తం అయింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి పిలుస్తున్నట్లు (రీకాల్) వెల్లడించింది. మార్చి 26న పూణేలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిన ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ స్కూటర్ కు సంబంధించిన బ్యాచ్ లోని అన్ని వాహనాలను వెనక్కి పిలిపించి.. వాటి బ్యాటరీ, ఇంజిన్లు, థర్మల్ సిస్టంలను సర్వీస్ ఇంజినీర్లతో తనిఖీ చేయిస్తామని ఓలా పేర్కొంది.
తమ స్కూటర్లలో అమర్చిన బ్యాటరీలు భారత ప్రమాణాలతో పాటు యూరప్ ప్రమాణాలకు కూడా సరిపోతాయని వివరించింది. మరోవైపు ‘ ఒకినవా’ కంపెనీ కూడా దాదాపు 3,000కుపైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను, ‘ ప్యూర్ ఈవీ’ కంపెనీ 2000 స్కూటర్లను రీకాల్ చేశాయి. ఇటీవల మనదేశంలో పలుచోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. తెలంగాణలోని నిజామాబాద్, విజయవాడలోనూ ఇలాంటి ఘటనలు జరిగి ఇద్దరు చనిపోయారు. మంచిర్యాలలో కూడా ఓ స్కూటీ తగులబడిపోయింది. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మరలుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.