Delhi Police : నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై కేసు నమోదు…!!
ఓ టీవీ చర్చ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ..మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఢిల్లీ మీడియా విభాగం బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విట్టర్లో స్పందించడం ఈ మధ్య తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.
- Author : hashtagu
Date : 09-06-2022 - 10:06 IST
Published By : Hashtagu Telugu Desk
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ..మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఢిల్లీ మీడియా విభాగం బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విట్టర్లో స్పందించడం ఈ మధ్య తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా బీజేపీ వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించింది. తర్వాత నుపుర్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే వీరి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెనుదుమారాన్నే రేపాయి. ఇస్లామిక్ దేశాలు మండిపడుతున్నాయి. కొన్ని దేశాల్లో భారతీయ ఉత్పత్తుల్నిసైతం బహిష్కరించాలని పిలుపునిచ్చేస్థాయి వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విద్వేషాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించారని నుపుర్ శర్మ, నవీన్ జిందాలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితోపాటు మరికొందరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దేశంలో అశాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశ్యంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేపడతామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.