KL Rahul: అందుకే పంజాబ్ జట్టును వీడా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్కు సమయం దగ్గర పడుతోంది. శనివారం నుంచి ముంబై వేదికగా ఈ టీ ట్వంటీ ఫెస్టివల్కు తెరలేవబోతోంది.
- By Balu J Published Date - 10:47 PM, Mon - 21 March 22
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్కు సమయం దగ్గర పడుతోంది. శనివారం నుంచి ముంబై వేదికగా ఈ టీ ట్వంటీ ఫెస్టివల్కు తెరలేవబోతోంది. ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. అటు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ళ ధరించే జెర్సీలను ఆవిష్కరించడంతో పాటు ప్రోమో షూటింగ్స్ చేస్తూ సందడి షురూ చేశాయి. ఈ సందర్భంగా కొత్త జట్లతో చేరిన పలువురు ఆటగాళ్ళు తమ ఐపీఎల్ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన పాత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పంజాబ్ జట్టును ఎందుకు వీడాల్సి వచ్చిందో వెల్లడించాడు. ఐపీఎల్లో తాను కొత్తగా ఏం చేయగలనో అనేది తెలుసుకునేందుకే పంజాబ్ జట్టుకు గుడ్బై చెప్పానని కెఎల్ రాహుల్ చెప్పాడు.
నాలుగేళ్ళ పాటు వారితో కలిసి ఉన్నానని, నిజానికి ఈ నిర్ణయం చాలా కఠినమైనదన్నాడు. సుధీర్ఘకాలంగా పంజాబ్తో విడదీయలేని బంధం ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. కొత్తగా ఏదైనా చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. దీని గురించి చాలా ఆలోచించాల్సి వచ్చిందని తెలిపాడు. నిజానికి
ఐపీఎల్ వేలానికి ముందు కెఎల్ రాహుల్ను పంజాబ్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవాలని భావించింది. అయితే రాహుల్ మాత్రం రిటైన్ చేసుకోవద్దని కోరడంతో ఫ్రాంచైజీ అతన్ని వేలంలోకి వదిలేసింది. ఈ క్రమంలో లక్నో సూపర్జెయింట్స్ రాహుల్ను రిటైన్ చేసుకుని సారథ్య బాధ్యతలు అప్పగించింది. కెరీర్లో కొత్త సవాళ్ళను ఎదుర్కొవాలనే ఉద్ధేశంతోనే జట్టు మారినట్టు రాహుల్ స్పష్టం చేశాడు.
గత సీజన్ వరకూ పంజాబ్ కింగ్స్కు సారథిగా వ్యవహరించిన కెఎల్ రాహుల్ పలు కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. గత సీజన్కు సంబంధించి 13 ఇన్నింగ్స్లలో 626 పరుగులు చేశాడు. అయితే బ్యాటర్గా సఫలమైనా.. కెప్టెన్గా మాత్రం నిరాశే మిగిలింది. పంజాబ్ను ప్లే ఆఫ్స్కు చేర్చడంలో విఫలమయ్యాడు. అంచనాలు పెట్టుకున్న పలువురు స్టార్ ప్లేయర్స్ సరిగా ఆడలేకపోవడంతో పంజాబ్ కింగ్స్ లీగ్ స్టేజ్కే పరిమితమైంది. అయితే ఆ ఫ్రాంచైజీ మాత్రం రాహుల్ను కొనసాగించాలని నిర్ణయించగా… అతను మాత్రం తిరస్కరించాడు. ఈ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ సారథిగా ఎంపికైన రాహుల్ కొత్త జట్టు తరపున సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాడు.
Related News
RCB vs CSK : ఆర్సీబీతో కీలక మ్యాచ్..చెన్నై తుది జట్టులో మార్పులు లేనట్టే
RCB vs CSK: ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగే పోరు చివరి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో డిసైడ్ చేయబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ […]