Justice Battu Devanand: మీ రాజధాని ఏదని మా అమ్మాయిని ఆటపట్టిస్తున్నారు..జస్టిస్ బట్టు దేవానంద్
తెలుగు జాతి అంటేనే చులకనైపోయిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
- Author : HashtagU Desk
Date : 18-09-2022 - 6:06 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు జాతి అంటేనే చులకనైపోయిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఈ రోజు ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన అమృతభారతి పుస్తకావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. రాజధాని విషయంలో ఇతరరాష్ట్రాల వారి దగ్గర అవమానాలు పొందే పరిస్థితిలో మనం ఉన్నామన్నారు.
‘‘మా అమ్మాయి ఢిల్లీలోని కాలేజీలో చదువుతోంది. తోటి విద్యార్థులు మీ రాజధాని ఏక్కడంటూ మా అమ్మాయిని ఆట పట్టిస్తున్నారు. పిల్లలు కూడా తలదించుకునే స్థితిలో మనం ఉన్నాం. 75 ఏళ్ల తర్వాత తెలుగు వారి పరిస్థితి ఏమిటి? అందరూ ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఏం సాధించాం? రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకునే పరిస్థితి ఉందా? మనలో ఐక్యత లేదు, ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం… ఇలాంటి అవలక్షణాలు మార్చాల్సిన బాధ్యత రచయితలదే. సామాన్యులను సైతం చైతన్యపరిచే గొప్ప మేథోశక్తి కలిగినవారు రచయితలు. సమాజాన్ని చైతన్యపరచాల్సిన బాధ్యత రచయితలపైనే ఉంది ’’ అని జస్టిస్ దేవానంద్ చెప్పారు. సభలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.