Tricolour In Space: పుడమికి 1,06,000 అడుగుల ఎత్తులో తిరంగా రెపరెపలు.. ఏమిటి, ఎలా?
భూమి నుంచి 1,06,000 అడుగుల ఎత్తున భారత జాతీయ జెండా ఆవిష్కృతం అయింది.నేలకు పైన 30 కిలోమీటర్ల
- By Anshu Published Date - 06:15 AM, Tue - 16 August 22

భూమి నుంచి 1,06,000 అడుగుల ఎత్తున భారత జాతీయ జెండా ఆవిష్కృతం అయింది.నేలకు పైన 30 కిలోమీటర్ల ఎత్తులోనూ మువ్వన్నెల జెండా రెపరెపలు కనువిందు చేశాయి. నింగికే శోభను తీసుకొచ్చాయి. ఇంతకీ ఈ వినూత్న కార్యక్రమం ఎలా నిర్వహించారో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.
ఆజాదీశాట్ .. వీళ్ళ చొరవే
స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ అనే సంస్థ ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది.బెలూన్ సాయంతో 1,06,000 అడుగుల ఎత్తుకి జాతీయ జెండాను పంపి ఆవిష్కరించింది. స్పేస్ కిడ్జ్ ఇండియా అనేది దేశానికి యువ శాస్త్రవేత్తలను అందించేందుకు కృషి చేస్తున్న సంస్థ. హద్దులు లేని ప్రపంచం కోసం చిన్నారుల్లో ఈ సంస్థ అవగాహన కల్పిస్తోంది. ఇటీవల లోఎర్త్ ఆర్బిటర్లోకి ఉపగ్రహం ‘ఆజాదీశాట్’ను కూడా ప్రయోగించింది. దేశవ్యాప్తంగా 750 మంది విద్యార్థినులతో ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. అయితే, ఆజాదీశాట్’ను కక్ష్యలో పెట్టడంలో ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) విఫలమైంది.
సమంత,రాజాచారి అంతరిక్ష సందేశాలు..
దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ అంతరిక్షం నుంచి కూడా ఇప్పటికే పలు సందేశాలు వచ్చాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత సంతతి ఇటలీ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి ఒక వీడియో సందేశాన్ని పంపుతూ భారత్కు 75 వసంతాల స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, భారతీయ అమెరికన్ వ్యోమగామి రాజాచారి కూడా కొని ఇంట్రెస్టింగ్ ఫొటోలు షేర్ చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన తండ్రి నగరమైన హైదరాబాద్ ఎలా వెలిగిపోతోందో అంతరిక్షం నుంచి వీక్షిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ అమెరికన్లు నిత్యం పురోగమిస్తున్న వాటిలో నాసా కూడా ఒకటని అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోలను షేర్ చేశారు.