BRS: ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి.. ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించాలి
- By Balu J Published Date - 10:54 PM, Tue - 20 February 24
BRS: ఐఈఆర్పీ (IERP)లుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ IERP) లను రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలోని మానసిక వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులకు విద్యను అందిస్తూ తమ సేవలను అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీరిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, అందుకు అవసరమైన పోస్టులను రెగ్యులర్ డీఎస్సీలో పొందుపర్చకుండా ఇతర ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ వేయాలని చూస్తున్న తరుణంలో వీరిని రెగ్యులరైజ్ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1523 పోస్టులను మానసిక వైకల్యం ఉన్న వారికి బోధించడానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. గతంలో అతి తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండే వారని ప్రస్తుతం వారి సంఖ్య 70వేలకు చేరిందన్నారు. వారందరికి 996 మంది ఐఈఆర్పీలు బోధిస్తున్నారని, వీరిని రెగ్యులరైజ్ చేసి మిగిలిన పోస్టులను డీఎస్సీలో భర్తీ చేయాలని సూచించారు. కాంట్రాక్టు విధానంలో పనిచేసిన జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ లను రెగ్యులరైజ్ చేసినందున వీరిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.
మానసిక వైకల్యం ఉన్న వారికి విద్యను బోధించడం సాధారణ విషయం కాదని, వారిని మానవీయ కోణంలో సైతం ప్రభుత్వం ఆలోచించి రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ విద్యార్థులకు బోధించడం సహజమైన విషయమని, కానీ మానసిక వైకల్యంతో బాధ పడే బోధించడం అంత సులువైన పని కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఐఈఆర్పీలు తక్కువ వేతనంతో గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందస్తున్నారని, వారు రెగ్యులర్ వారితో డీఎస్సీలో పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అనేక మంది వయస్సు పైబడినందున వారిని ప్రత్యేక కేటగిరిగా పరిగణించి రెగ్యులరైజ్ చేయాలన్నారు.
Related News
Padi Kaushik Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
తెలంగాణలో ఎన్నికల వేళ రోజురోజుకు రాజకీయ వేడి పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.