Yadadri: యాదాద్రి లో ‘కేసీఆర్’ .. ఆలయ నిర్మాణ పనులు పరిశీలన
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి యాదాద్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట..
- By Hashtag U Published Date - 04:39 PM, Mon - 7 February 22

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి యాదాద్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట.. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభం తో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
ఆలయ ఈవో స్వామివారి ప్రసాదంను సీఎం కేసీఆర్ కు అందజేశారు. బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అర్చకులు సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనం అందజేశారు.
ఆ తర్వాత దాదాపుగా పూర్తి కావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించారు. కళ్యాణ కట్ట , పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సుదర్శన యాగం తలపెట్టిన యాగ స్థలాన్ని 75 ఎకరాల సువిశాల ప్రాంగణం లో నిర్వహించనున్న యాగశాల ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు.
పుష్కరిణీ లో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత… స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలనూ సీఎం పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులపై కాసేపట్లో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.