Delhi Capitals: ఢిల్లీ తుది జట్టులో భారీ మార్పులు
ఐపీఎల్ 2022లో భాగంగా నేడు మరో హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. మహారాష్ట్రలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి.
- By Naresh Kumar Published Date - 05:03 PM, Thu - 7 April 22

ఐపీఎల్ 2022లో భాగంగా నేడు మరో హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. మహారాష్ట్రలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట్లో గెలిచి జోరుమీదున్న లక్నో జట్టు ఈ మ్యాచ్లో కూడా ఎలాగైనా విజయం సాధించాలని తహతహలాడుతుండగా, ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచులో మాత్రమే గెలిచి మరో మ్యాచ్ లో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది.
అయితే ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ అన్రిచ్ నోర్జ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరారు.. ఈరోజు మ్యాచ్లో వీరిద్దరూ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక డేవిడ్ వార్నర్ తుది జట్టులోకి రావడంతో గత రెండు మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన టీమ్ సీఫెర్ట్ ఈ మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఇక అన్రిచ్ నోర్జ్ జట్టులోకి రావడంతో ఖలీల్ అహ్మద్ తుది జట్టుకు దూరం కానున్నాడు. ఇక తొలి రెండు మ్యాచుల్లో నిరాశపరిచిన మన్దీప్ సింగ్ స్థానంలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్కు చోటు దక్కనుంది.
ఇక ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొట్టనున్న ఢిల్లీ తుది జట్టును పరిశీలిస్తే.. ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ బరిలోకి దిగనుండగా.. మూడో స్థానంలో కేఎస్ భరత్, మిడిలార్డర్ లో కెప్టెన్ రిషబ్ పంత్ , లలిత్ యాదవ్, లోయరార్డర్ లో రోవ్మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ కు రానున్నారు… ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు బౌలింగ్ బాధ్యతల్ని అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్ మోయనున్నారు.