Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి మరో షాక్
Vallabhaneni Vamsi : నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు పోలీసులు నూజివీడు కోర్టులో పీటీ వారంట్ దాఖలు చేశారు
- By Sudheer Published Date - 07:30 PM, Thu - 15 May 25

వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి మరో దెబ్బ తగిలింది. కృష్ణా జిల్లాలోని బావులపాడు గ్రామంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు పోలీసులు నూజివీడు కోర్టులో పీటీ వారంట్ దాఖలు చేశారు. కోర్టు దీనికి అనుమతి ఇస్తే వంశీ ప్రస్తుతం ఉన్న జైలు నుండి త్వరలో విడుదలయ్యే అవకాశాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయనపై పలుసంఖ్యలో కేసులు నమోదై ఉన్నాయి.
వల్లభనేని వంశీపై ఇప్పటివరకు ఆరు కేసులు నమోదవగా, అందులో ఐదు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో మాత్రం ఇంకా తీర్పు రాలేదు. ఈ కేసులో బెయిల్ మంజూరయ్యే విషయంపై కోర్టు రేపు (మే 16) తీర్పు వెలువరించనుంది. ఇదే సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పీటీ వారంట్ దాఖలవడం వంశీకి తీవ్ర ఎదురుదెబ్బగా మారింది.
పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలిచిన వల్లభనేని వంశీ, ఇటీవల రాజకీయ పరంగా కూడా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయనపై నమోదైన కేసుల సంఖ్య పెరిగినట్టుగా చెబుతున్నారు. తాజా పీటీ వారంట్తో ఆయనపై న్యాయపరమైన పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.