Woman Drinkers: మద్యం మత్తులో మహిళలు, సంచలన విషయాలు బయటపెట్టిన అమెరికా సర్వే!
మద్యం తాగడం వల్ల పురుషుల కంటే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నట్టు ఓ సర్వేలో వెలుగుచూసింది.
- Author : Balu J
Date : 23-08-2023 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
స్పీడ్ యుగంలో మహిళలు కూడా మగవారితో సమానంగా పనిచేస్తున్నారు. అన్ని రంగాల్లో గట్టి పోటీని ఇస్తున్నారు. అయితే ఐటీ సెక్టార్, వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు తరచుగా మద్యం తాగుతున్నారు. చాలామంది హైజ్ వైఫ్ లు కూడా పార్టీల పేరుతో మద్యం తీసుకుంటున్నారు. అయితే మహిళలు మద్యం తీసుకోవడం వల్ల మగవారికే కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతారట. అంతేకాదు.. వారి ఆయుష్సు తగ్గి త్వరగా మరణిస్తారని అమెరికాలోని కొత్త సర్వేలు చెబుతున్నాయి.
మద్యం తాగడం వల్ల పురుషుల కంటే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన మహిళల్లో మద్యపానం అలవాటు వల్ల మరణాల రేటు ఎక్కువగా కనిపిస్తోంది. 1999, 2020 మధ్య 21 సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యయనం, 6 లక్షల కంటే ఎక్కువ మద్యం సంబంధిత మరణాలు వెలుగు చూశాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనంలో కార్డియోమయోపతి, తీవ్రమైన మత్తు, మద్యపానానికి సంబంధించిన మానసిక ప్రవర్తనా లోపాలు ఉన్నట్టు గుర్తించారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా దాదాపు 1.3 మిలియన్ల మహిళలపై అధ్యయనం చేసింది. క్రమం తప్పకుండా తీసుకునే ప్రతి అదనపు ఆల్కహాల్ రొమ్ము క్యాన్సర్ కు కారణమవుతుందని తెలిసింది. ఈ అధ్యయనంలో 11 వేల మంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వెనుక మద్యపాన వ్యసనం ఉన్నట్టు గుర్తు చేశారు. COVID-19 మహమ్మారి సమయంలో కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ (CADD) ఢిల్లీలో ఒక సర్వే నిర్వహించింది. సర్వేలో, 37% కంటే ఎక్కువ మంది మహిళలు గత మూడేళ్లలో మద్యం తీసుకునే అలవాటు పెరిగిందని అంగీకరించారు.
ఈ సర్వే ప్రకారం, 45% కంటే ఎక్కువ మంది మహిళలు మద్యానికి వ్యసనం పెరగడానికి ఒత్తిడి కారణమని చెప్పారు. మరోవైపు 34.4 శాతం మంది మద్యం సులువుగా లభించడం వల్ల డ్రింక్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నారు. 30.1 శాతం మంది మహిళలు అలసట పోగొట్టుకోవడానికి మద్యం తీసుకోవడం మొదలుపెట్టినట్టు చెప్పారు.