PK and KCR: నాడు ‘పవన్’… నేడు ‘కేసీఆర్’. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ కానుందా..?
రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే పాలిటిక్స్ లో టైమింగ్ కూడా ఎంతో ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలను రచిస్తూ...
- By Hashtag U Published Date - 06:30 AM, Thu - 17 February 22
రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే పాలిటిక్స్ లో టైమింగ్ కూడా ఎంతో ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలను రచిస్తూ… జనాల నాడిని పట్టినవాడే సక్సెస్ అవుతాడు. ఒకానొక సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఒకరిచ్చే నినాదం సక్సెస్ అయితే… అది సఫలం అయిందని చెప్పుకుంటాం. అలా ఒకప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన నినాదం వర్కౌట్ అవగా… నేడు అలాంటి నినాదాన్నే అందుకున్నారు మరోపార్టీ అధ్యక్షుడు. ఇంతకీ వారందుకున్న నినాదం ఏంటి…? అసలు ఆ స్టోరి ఏంటి..? తెలుసుకోవాలనుకుంటున్నారా…? అయితే హ్యాష్ ట్యాగ్ యు ప్రత్యేక కథనాన్ని చూడండి.
అప్పుడు పవన్ అలా:
అది 2014… మార్చ్ 14. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పురుడుపోసుకుంది ఓ పార్టీ. అదే… జనసేన పార్టీ. జనసేన అంటే ‘పీపుల్స్ పార్టీ’ అని అర్దం. జనసేన పార్టీ పెట్టింది కూడా ప్రజలకోసమే. వారి సమస్యలు ఎలుగెత్తి చూపించడమే కాదు… వాటి పరిష్కార మార్గాలను సైతం కనుగొంటుంది ఈ పార్టీ. ఉత్తరాంధ్ర విషయానికొస్తే… అక్కడ కిడ్నీ సమస్య ఉందని జనసేన గుర్తించేవరకు ఎవరికీ తెలీదు. ఇంకా చెప్పాలంటే… ఉద్దానం కిడ్నీ సమస్యను గుర్తించి, బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిందే జనసేన పార్టీ. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్స్ ను కూడా రప్పించి, కిడ్నీ బాధితులకు అండగ నిలబడింది కూడా పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీనే. ఇలా ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేయడం అనేది పవన్ పార్టీ నినాదం.
ఇక రాజకీయంగా చూస్తే… పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ మాత్రం గిట్టదు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా తన అన్నకు అండగా నిలబడ్డ పవన్… కాంగ్రెస్ పార్టీపై తనకున్న కోపాన్ని పలు వేదికలపై తనదైన దూకుడు శైలిలో చూపించాడు. ఆ తర్వాత అదే ప్రజారాజ్యం పార్టీని తన అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో… పవన్ తట్టుకోలేకపోయారు. ఎప్పటికీ తన సిద్దాంతాలు… తన రూట్ వేరు అనుకుంటూ…. జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జనసేనాని. ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ అని అప్పుడు పవన్ పిలుపిచ్చారు. ఆ సమయంలో రాజకీయంగా పవన్ ఇచ్చిన పిలుపు ప్రకంపనలే సృష్టించాయి. మొత్తంగా పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. జాతీయస్థాయిలో కూడా ఓడిపోయింది. అంటే ఆనాడు పవన్ ఇచ్చిన పిలుపు వర్కౌట్ అయిందనే చెప్పాలి.
ఇప్పుడు కేసీఆర్ ఇలా:
ఉద్యమనేతగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించి సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సమయానికి తగ్గట్టు వ్యూహాలను రచించడంలో కేసీఆర్ దిట్ట అనేది రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రత్యర్దులు చెప్పేమాట. అలాంటి కేసీఆర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి నినాదాన్నే ఎంచుకున్నట్లు మనకు అర్దం అవుతోంది. అదేనండీ… 2014లో పవన్ కళ్యాణ్ దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని తరమేయాలి…. దేశాన్ని కాపాడుకోవాలని అని నినదిస్తే… ఇప్పుకు కేసీఆర్ కూడా బీజేపీ ని దేశం నుంచి గెంటేయాలి… దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తాజాగా ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ప్రధాని మోదీనే టార్గెట్ గా చేసుకుని మరీ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. రీసెంట్ గా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్, అనంతరం మరో మీడిమా సమావేశం పెట్టి, భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. మోదీ విషయంలో అయితే… ఉదాహరణలు చూపి మరీ విమర్శించారు. మొత్తంగా చూస్తే కేంద్రంపై గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ పొలిటికల్ వార్ డిసైడ్ చేశారనే చెప్పాలి. ఎందరో నాయకులు తనతో టచ్ లో ఉన్నారని.. అవసరమైతే జాతీయస్థాయిలో మరో పార్టీ పెడతానని కూడా హెచ్చరించారు కేసీఆర్. రాఫెల్ యుద్ధ విమానాల్లో కుంభకోణం జరిగిందని, ఆర్ధిక నేరగాళ్లు దేశం దాటేస్తున్నారని, విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రాలను మోదీ సర్కార్ మోసం చేస్తుందంటూ విమర్శలబాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈక్రమంలోనే కేసీఆర్.. బీజేపీ ని దేశం నుంచి గెంటేయాలి… దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఇకపోతే, భారతీయ జనతా పార్టీ వ్యతిరేక నేతలతోనే కాకుండా… ఇతర బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలతో కూడా చర్చిస్తున్నారు కేసీఆర్. దీన్ని బట్టే మనం అర్దం చేసుకోవచ్చు కేసీఆర్ బీజేపీ పై ఎంత కోపంగా ఉన్నారో అనేది. సహజంగానే పదేళ్లపాటు ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే… ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేది ఓ మాట. కేసీఆర్ కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పై దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను చూపి.. ఇతర రాష్ట్రాల్లోని పార్టీల అధినేతలను కలుపుకుని ముందుకుపోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని గద్దె దించాలంటే అంత ఈజీ కాదని కూడా కేసీఆర్ కు తెలుసు. అయినప్పటికీ తన వ్యూహాలు తనకుంటాయి. రాజకీయాల్లో ఏదైనా కూడా గ్రౌండ్ వర్క్ పక్కాగా చేస్తేనే… నిర్ణయం తీసుకుంటారనేది కేసీఆర్ సన్నిహితులు చెప్పే మాట. రైతు వ్యతిరేక చట్టాల నుంచి మొదలుకుని, యూపీలో రైతులను కార్లతో తొక్కించే ఘటన వరకు బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఆయుధంగా చేసుకుని, కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే, బీజేపీ ని దేశం నుంచి సాగనంపే పోరాటంలో… కేసీఆర్ తో కలిసి ఎవరెవరు వస్తారో… ముందుముందు రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయో అన్నది చూడాలి.
బీజేపీ పై పోరాటంలో కేసీఆర్ కు అండగా కొందరు:
‘బీజేపీ ముక్త్ భారత్’ పోరాటంలో కేసీఆర్ కు మద్దతుగా పలువురు నేతలు ఇప్పటికే తమ అంగీకారాన్ని తెలిపారు. అందులో మంగళవారం(ఫిబ్రవరి 15న) మాజీ ప్రధాని, జనతాదళ్(సెక్కులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి దేవెగౌడ సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలానే దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కేసీఆర్ ను ఆయన అభినందించారు కూడా. అలానే బుధవారం(ఫిబ్రవరి 16న) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి తన మద్దతు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం గులాబీ దళపతి కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈనెల 20న ముంబైలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కూడా కాబోతున్నారు. మరోవైపు చూస్తే… బెంగాల్ సీఎం దీదీ కూడా కేసీఆర్ తో టచ్ లోనే ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కేసీఆర్ కు మద్దతిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రకంగా బీజేపీ వ్యతిరేక శక్తులు కొన్ని అయినా సరే… ఒక దారిలోకి అయితే వస్తున్నట్లు మనకు కనిపిస్తోంది.
బీజేపీ వ్యతిరేక శక్తులకు లీడర్ ఎవరయ్యేను?:
ఒకవేళ కేసీఆర్ పిలుపుకు స్పందించి, బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకతాటిపైకి వచ్చినా… వారంతా ఓ ఫ్రంట్ లా ఏర్పడతారా…? వాళ్లలో అంత ఐకమత్యం ఉంటుందా అంటే… ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే… దీదీ(మమత బెనర్జీ) దీదీనే… కేసీఆర్..కేసీఆరే, స్టాలిన్.. స్టాలినే. ఎవరికి వారే లీడర్. వేరేవాళ్ల పెత్తనాన్ని ఎలానూ సహించలేరు. లీడర్ సమస్యని పక్కన బెడితే… కేసీఆర్ అంటున్నట్లు వీరంతా కలిసి జాతీయస్థాయిలో ఏదైనా పార్టీ పెడతారా…? అన్నది కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ వర్కౌట్ అయినా కూడా… ప్రధాని అభ్యర్థి ఎవరనేది మాత్రం అంత ఈజీగా తేలే ప్రశ్న అయితే కాదు.
సో… మొత్తంగా చూస్తే… 2014 ఎన్నికల్లో జరిగిన అధికార మార్పిడి… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జరుగుతుందా అన్నది చూడాలి. అలానే అప్పుడు పవన్ ‘కాంగ్రెస్ హఠావో’ నినాదం వర్కౌట్ అయినట్టు…. ఇప్పుడు కేసీఆర్ ‘బీజేపీ ముక్త్ భారత్’ నినాదం కూడా వర్కౌట్ అవుతుందా…? అన్నది వేచి చూడాలి.
Related News
AP : ఓటర్ల ప్రేమకు జనసేనాధినేత ఫిదా..
సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది