Vajramushti Kalaga : రక్తం చిందే దాకా కుస్తీ.. హోరాహోరీగా ‘వజ్రముష్టి కళగ’ పోటీలు
‘వజ్రముష్టి కళగ’ పోటీల్లో పాల్గొనే మల్ల యోధులను జట్టీలు (Vajramushti Kalaga) అని పిలుస్తారు.
- Author : Pasha
Date : 12-10-2024 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
Vajramushti Kalaga : మైసూరు దసరా ఉత్సవాలు మనదేశంలోనే చాలా ఫేమస్. ఇక్కడ దాదాపు 400 ఏళ్లుగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం మైసూరు నగరంలో ఏనుగులతో జంబో సవారీ ఊరేగింపు జరగనుంది. దీంతో అక్టోబరు 3న ప్రారంభమైన దసరా ఉత్సవాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఇవాళ మైసూరు రాజ భవనం ప్రాంగణంలో ‘వజ్రముష్టి కళగ’ పోటీలను హోరాహోరీగా నిర్వహించనున్నారు. ఈ పోటీలు జరిగే ప్రదేశాన్ని కన్నడి తొట్టి అని పిలుస్తారు. ‘వజ్రముష్టి కళగ’ పోటీల్లో పాల్గొనే మల్ల యోధులను జట్టీలు (Vajramushti Kalaga) అని పిలుస్తారు.
Also Read :Optimus Robot : ఇరగదీసిన ఆప్టిమస్ రోబో.. వామ్మో మనుషుల్ని మించిపోయింది
మైసూరును పాలించిన వడియార్ రాజవంశం హయాంలో క్రీ.శ.1610లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ‘వజ్రముష్టి కళగ’ పోటీలను ప్రారంభించే ముందు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జట్టిల కుటుంబీకులు, వంశస్తులు హాజరై ఈ పోటీలను తిలకిస్తారు. ఇద్దరు చొప్పున ఈ పోటీలో తలపడతారు. గుండు గీయించుకొని, వేళ్లలో ఇమిడిపోయే చిన్నపాటి ఇనుప ఆయుధాన్ని చేతికి ధరించి ఒకరినొకరు భీకరంగా కొట్టుకుంటారు. ఈ పోటీలో ఎవరికి ముందుగా రక్తం చిందితే వాళ్లను ఓడిపోయినట్టుగా గుర్తిస్తారు.
Also Read :Devaragattu : కర్రల సమరం నేడే.. డ్రోన్లు, సీసీటీవీలతో దేవరగట్టులో నిఘా
మైసూరు సామ్రాజ్యాన్ని పాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ.. ఈ నగరంలోని చాముండేశ్వరి అమ్మ వారికి అనేక ఆభరణాలు, వస్తాల్రు సమర్పించారని అంటారు. ఈ సంప్రదాయాన్ని హైదర్ అలీ కుమారుడు టిప్పుసుల్తాన్ కూడా కొనసాగించారని చెబుతారు. అందుకే నవరాత్రుల్లో ఏడో రోజున చాముండీదేవి అమ్మవారికి ఆభరణాల్ని అలంకరించటం ఇక్కడి సంప్రదాయం. ఆ రోజు రాత్రి నుంచి 12 రోజుల పాటు అమ్మవారిని అలంకరిస్తారు. మొత్తం మీద దసరా వేళ మైసూరు నగరం ఆధ్యాత్మిక సందడితో కిటకిటలాడుతుంది. కర్ణాటకలో అతిపెద్ద టూరిస్టు హబ్గానూ ఈ నగరం వెలుగొందుతోంది. ఇక్కడి దసరా ఉత్సవాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు.